ఇరవై ఏళ్లుగా ఆయోధ్య రాముడి సేవలో ముగ్గురు ముస్లింలు!
న్యూఢిల్లీ: హిందువుల దేవుడైనా శ్రీరాముడి సేవలో ముగ్గురు ముస్లింలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ ఇది నిజం! అయోధ్యలోని తాత్కాలిక రామాలయంలో ఈ ముగ్గురు ముస్లింలు తమ సేవలు అందిస్తున్నారు.
అబ్దుల్ వాహిద్ (38) అనే వెల్డర్ ఈ రామాలయంలో ఇరవయ్యేళ్లుగా సేవలు అందిస్తున్నాడు. ఆయనకు రోజుకు రూ.250 చెల్లిస్తారు. పిలిచిన రోజున చెప్పిన పనల్లా చేయాలి. 1994లో తొలిసారి ఆలయంలో అడుగు పెట్టానని, అప్పట్నించి ఆలయం చుట్టూ ఎక్కడ బార్బ్డ్ వైర్ తెగినా తననే సంప్రదిస్తారని వెల్డర్ అబ్దుల్ వాహిద్ చెబుతారు.
ఇక సాధిక్ అలీ అనే టైలర్ కుర్తా, పైజామాలు కుడతారు. ఏడాదిలో రెండు మూడుసార్లు ఈయన దేవుడి బట్టలు కుడతాడు. టైలర్ సాధిక్ కస్టమర్లంతా హిందువులే. ఆయన టైలర్ షాపు కూడా హనుమాన్ గడీ ఆలయ ప్రాంగణంలో ఉండడం విశేషం.
రామజన్మభూమి ఆలయం ప్రధాన పూజారి అవసరమైనపుడల్లా పిలిచి మరీ సాధిక్ చేతుల మీదుగా దేవుడికి బట్టలు కుట్టిస్తారు. దేవుడు అందరికీ ఒక్కడేనని, ఆయనకు బట్టలు కుట్టడంతో ఆనందం పొందుతానని సాధిక్ చెబుతుంటాడు.
ఇక సాధిక్ స్నేహితుడైన మెహబూబ్ అయోధ్యలోని ఆలయాలకు విద్యుదీకరణ పనులు చేస్తుంటాడు. 1995లో సీతాకుండ్ నుంచి నీరు తోడేందుకు మోటారు తీసుకొని రావడం ద్వారా మెహబూబ్ ఆలయంలో అడుగు పెట్టాడు.
ఏడాది పొడవునా రాంలల్లా విగ్రహం చుట్టూ రంగురంగుల లైట్లు వెలిగేట్లు మెహబూబ్ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా ఈ ముగ్గురు ముస్లింలు మూడు రకాల విధులు నిర్వహిస్తూ అయోధ్య రాముడికి, రామాలయానికి అంకితం అయ్యారు.