గుడ్ న్యూస్... కరోనా ట్రీట్మెంట్కు అతి చౌక ధరలో మందు... వివరాలివే...
తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతున్నవారికి చౌక ధరలో మెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ప్రకటించింది. కేవలం రూ.35కే ఫ్లూగార్డ్(ఫవిపిరవిర్ 200ఎంజీ)ని ట్యాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఫవిపిరవిర్ డ్రగ్ను మొదటిసారిగా ఇన్ఫ్లుయెంజా చికిత్స కోసం జపాన్కు చెందిన ఫ్యుజిఫిలిం హోల్డింగ్స్ కార్పోరేషన్ ఎవిగాన్ అనే బ్రాండ్ పేరుతో అభివృద్ది చేసింది.
సన్ ఫార్మా సీఈవో ఏమన్నారు...
కోవిడ్ 19 చికిత్స కోసం భారత్ అనుమతిచ్చిన ఓరల్ యాంటీ వైరల్ డ్రగ్(నోటి ద్వారా తీసుకునే మాత్రలు) ఫవిపిరవిర్ మాత్రమే. సన్ ఫార్మా సీఈవో కీర్తి గనోర్కర్ మాట్లాడుతూ.. 'భారత్లో రోజుకు 50వేల కోవిడ్ 19 కేసులు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో.. విస్తృతమైన చికిత్సా విధానాలు అత్యవసరంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మేము సాధారణ ధరలో FluGuardని అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని ద్వారా పేషెంట్లపై చాలావరకు భారం తగ్గుతుంది. భారత్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మా వంతు కృషిని మేము చేస్తున్నాం.' అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేలా...
తమ కంపెనీ అటు ప్రభుత్వంతో ఇటు మెడికల్ కమ్యూనిటీతో సమన్వయం చేసుకుని దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్లకు ఫ్లూగార్డ్ని అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టిందని సన్ ఫార్మా వెల్లడించింది. ఈ వారం నుంచే ఫ్లూగార్డ్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. కాగా,భారత్లో అగ్ర స్థానంలో ఉన్న ఫార్మాసూటికల్ కంపెనీల్లో సన్ ఫార్మా ఒకటి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్పెషాలిటీ జనరిక్ ఫార్మా కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది.
Recommended Video
రూ.59కి అందుబాటులో తీసుకొచ్చిన హెటిరో...
భారత్కు చెందిన గ్లెన్మార్క్,సిప్లా,హెటిరో ల్యాబ్స్ కూడా ఫవిపిరవిర్ డ్రగ్ను అభివృద్ది చేసే లేదా అమ్మకానికి తీసుకొచ్చే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్కి చెందిన హెటిరో కూడా తక్కువ ధరలో ఫవిపిరవిర్ డ్రగ్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఓరల్ డ్రగ్ను కేవలం రూ.59కే జూలై 29 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.