#AT21.: దిశ రవి అరెస్టు నేర్పుతున్న పాఠాలు- వయసు కేవలం సంఖ్యే- నేరం నేరమే
అంతర్జాతీయ వాతావరణ ఉద్యమకారిణి గ్రెట్ ధన్బర్గ్ ట్వీట్లో భారత్లో రైతు నిరసనల ఉద్యమాన్ని ఎలా నడిపించాలో మార్గదర్శనం చేస్తున్న టూల్కిట్ను కర్నాటకలోని బెంగళూరుకు చెందిన దిశా రవి అనే ఉద్యమకారిణి ఎడిటింగ్ చేసి అరెస్టు కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిశా రవిని పోలీసు కస్టడీకి అప్పగించారు. దీంతో ఆమె వెనుక గ్రెట్ థన్బర్గ్తో పాటు ఇంకెవరు ఉన్నారనే కోణంలో విచారణ సాగుతోంది. అయితే 21 ఏళ్ల దిశా రవి అరెస్టుపై దేశంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. వయసుకూ, నేరానికీ ఉన్న సంబంధంపైనా విస్తృత చర్చ జరుగుతోంది.
దిశా రవి అరెస్టుపై నిరసనలు
ఢిల్లీలో రైతు నిరసలనకు మద్దతుగా అంతర్జాతీయ సామాజిక కార్యకర్త గ్రెట్ ధన్బర్గ్ చేసిన ట్వీట్లో వాడిన టూల్కిట్ను ఎడిట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక సామాజిక కార్యకర్త దిశా రవిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చడమే కాకుండా కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెపై జరుగుతున్న దర్యాప్తులో ఆమెకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నికితా జాకబ్పైనా పోలీసులు దృష్టిపెట్టారు. అయితే దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
21 ఏళ్ల కార్యకర్తను అరెస్టు చేస్తారా అంటూ
రైతు నిరసనలకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లో భాగస్వామి అయ్యిందన్న కారణంతో 21 ఏళ్ల దిశా రవిని అరెస్టు చేయడంపై విపక్షాలతో పాటు దేశంలో పలువురు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్ధలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సైతం ప్రజాస్వామ్యంపై జరిగిన అద్భుతమైన దాడిగా దీన్ని అభివర్ణించారు. ఆయకే కాదు ప్రస్తుతం దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న వారితో పాటు ఇతరులు కూడా దిశా రవి అరెస్టును ఖండిస్తున్నారు.
నేరానికీ, వయసుకు ఏంటి సంబంధం ?
అయితే 21 ఏళ్ల దిశా రవి అరెస్టుపై మండిపడుతున్న వారికి కౌంటర్గా దీన్ని సమర్ధిస్తున్న వారు కూడా ఉన్నారు. చేసిన నేతాన్ని చూడకుండా వయసు నిందితురాలి వయసు గురించి మాట్లాడుతూ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వారి నుంచి వినిపిస్తున్నాయి. గతేడాది పుల్వామా దాడికి పాల్పడిన తీవ్రవాది వయసు కూడా 21 ఏళ్లేనని వారు గుర్తుచేస్తున్నారు. మరికొందరైతే 400 మీటర్ల స్పింట్ రికార్డు నెలకొల్పిన అసోం మహిళా రన్నర్ హిమా దాస్ వయస్సు కూడా 21 ఏళ్లే అని చెప్తున్నారు. ఇంకొందరు 21 ఏళ్లకే ఆర్మీలో అఢుగుపెట్టిన మహిళల ఫొటోల్ని పోస్ట్ చేస్తూ ఈ వయసులో దేశం గర్వపడేలా చేస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు. గల్వాన్ ఘటనలో అమరుడైన అంకుష్ శర్మకు కూడా 21 ఏళ్లేనని గుర్తుచేస్తున్నారు. అటువంటప్పుడు 21 ఏళ్ల దిశా రవిని వెనకేసుకు వస్తున్న లెఫ్టిస్టులు రేపు అంతకంటే తక్కువ వయసు కలిగిన అజ్మల్ కసబ్ను, బుర్హాన్ వానీని కూడా ప్రశంసిస్తారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
దిశా రవి అరెస్టుపై పార్టీల ట్వీట్ వార్
దిశా రవి అరెస్టును వ్యతిరేకిస్తూ విపక్షంలోని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, కేజ్రివాల్తో పాటు మరికొందరు ట్వీట్లు పెడితే, వాటికి కౌంటర్గా పలువురు బీజేపీ నేతలు కూడా వీటికి కౌంటర్లు ఇస్తున్నారు. 21 ఏళ్ల వయస్సు అన్న కారణంతో దిశా రవి చేసిన పనిని సమర్ధించడం దేశానికి మంచిది కాదని బీజేపీ నేతలు వీరికి కౌంటర్ ఇస్తున్నారు. వయసుతో నేరానికి ముడిపెట్టడం మొదలుపెటితే ఇక దేశంలో జరిగే ప్రతీ అంశాన్ని వయసుతోనే ముడిపెట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు దీంతో హ్యాష్ట్యాగ్ 21 ట్వీట్లకు అదే స్ధాయిలో కౌంటర్లు పడుతున్నట్లు తెలుస్తోంది.