భారతరత్నం: అటల్ బిహారీ వాజపేయి రాజకీయ ప్రయాణం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ 1924 డిసెంబర్ 25వ తేదీన గ్వాలియర్లో జన్మించారు. బీజేపీ తరఫున తొలి ప్రధాని. ఈయన బ్రహ్మచారి. ఇతను తొలిసారి రెండవ లోకసభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3, 9వ లోకసభలు తప్పించి 14వ లోకసభ ముగిసే వరకు పార్లమెంటులో ప్రాతినిథ్యం వహించారు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారు.
1980 నుంచి 1986 వరకు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అయితే నాడు రాజకీయ కారణాల వల్ల ప్రభుత్వం మూడు రోజులకే కూలిపోయింది. 1998లో రెండోసారి ప్రధాని అయ్యారు. అప్పుడు 13 నెలలు పాలించారు. 1999లో 13వ లోకసభ తర్వాత మూడోసారి ప్రధాని అయ్యారు. పూర్తికాలం 2004 వరకు ప్రధానిగా కొనసాగారు. ఎన్డీయే ప్రధానిగా పలు పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన ప్రధానిగా.. మిత్రపక్షాల ప్రశంసలు అందుకున్నారు.
1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వాజపేయికి 2015లో భారతరత్న ప్రకటించారు. అనారోగ్యంతో మంచంపై ఉన్న వాజపేయికి భారతరత్న ప్రదానం చేసేందుకు నాటి రాష్ట్రపతి ప్రణబ్ స్వయంగా ఆయన నివాసానికి వచ్చారు. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 25 సుపరిపాలనా దినంగా ప్రభుత్వం ప్రకటించింది.