ఆయన ప్రసంగిస్తే వినాలనుంది, మా మనసుల్లోనే ఎప్పుడూ: వాజపేయి మేనకోడలు భావోద్వేగం
Recommended Video
గ్వాలియర్/న్యూఢిల్లీ: తన మేనమామ ప్రసంగిస్తే మరోసారి చూడాలనుందని భావోద్వేగానికి గురయ్యారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మేనకోడలు కాంతి మిశ్రా. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎయిమ్స్ వైద్యులు గురువారం ఉదయం వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాజపేయి మేనకోడలు మీడియాతో మాట్లాడారు.
'మా మామయ్య త్వరగా కోలుకోవాలి. ఆయన మళ్లీ ప్రసంగిస్తుంటే చూడాలనుంది. అందుకోసం నేను మొక్కని దేవుడంటూ లేడు. ఆయన మాటలు, రూపాన్ని మా కుటుంబీకులు ఏనాటికీ మర్చిపోలేరు. ఆయన ఎప్పుడూ మా మనసుల్లోనే ఉంటారు. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను' అంటూ కాంతి మిశ్రా కన్నీటిపర్యంతమయ్యారు.
వాజపేయికి ప్రస్తుతంవెంటిలేటర్పై చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజపేయికి చికిత్స అందిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు వైద్యులతో వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అడిగితెలుసుకుంటున్నారు.