ఆరెస్సెస్ నుంచి పోక్రాన్ అణు పరీక్షల వరకు: వాజపేయి గురించి ఆసక్తికర అంశాలు
న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజపేయి బీజేపీ అగ్రనేత. ఆయన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి పదవిని పొందిన మొదటి నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఆయన గురించి పది ముఖ్య విషయాలు
1. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 25 డిసెంబర్ 1924లో జన్మించారు. భారత్కు పదో ప్రధాని. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999లో ఐదు సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు.
2. వాజపేయి పదిసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. అతను భారతీయ జన సంఘ్ అధ్యక్షుడిగా పని చేశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. 1980లో బీజేపీ ఆవిర్భవించింది.
3. 25 డిసెంబర్ 2014న వాజపేయికి కేంద్రం భారతరత్న ప్రకటించింది. వాజపేయి అనారోగ్యంతో మంచంపై ఉండటంతో, 27 మార్చి 2015లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన ఇంటికి వెళ్లి భారతరత్న ప్రదానం చేశారు. వాజపేయి పుట్టిన 25 డిసెంబర్ను కేంద్రం సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించింది.
4. 1939లో ఆరెస్సెస్లో చేరారు. 1940 నుంచి 1944 మధ్య ఆరెస్సెస్ శిక్షా వర్గాలకు వెళ్లారు. 1947 నుంచి ఆరెస్సెస్కు ఫుల్ టైమ్ వర్కర్గా ఉన్నారు. దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల వాజపేయి న్యాయశాస్త్ర విద్యను మధ్యలోనే ఆపేశారు.
5. ఆరెస్సెస్ విస్తారక్గా యూపీ వెళ్లారు. అక్కడ దీన్ దయాల్ ఉపాధ్యాయ నడుపుతున్న రాష్ట్రధర్మ హిందీ మాసపత్రిక, పాంచజన్య హిందీ వారపత్రికలతో పాటు స్వేదేశ్, వీర్ అర్జున్ వంటి దిన పత్రికలలో పని చేశారు.
6. వాజపేయి బ్రహ్మచారి. 1942లో క్విడ్ ఇండియా ఉద్యమం సమయంలో అరెస్టై 23 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 1951లో భారతీయ జన సంఘ్ పార్టీ కోసం పని చేశారు. తక్కువ కాలంలోనే జనసంఘ్ నేత శ్యాంప్రసాద్ ముఖర్జీకి అనునాయిగా మారారు. వాజపేయి వాగ్ధాటిని చూసిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయన ఏనాటికైనా ప్రధాని అవుతారని ఊహించారు.
7. ఎమర్జెన్సీ సమయంలో వాజపేయి కూడా అరెస్టయ్యారు. వాజపేయి తన ఆరెస్సెస్ సహచరులు, దీర్ఘకాల మిత్రులు అద్వానీ, బైరాన్ సింగ్ షేకావత్తో కలిసి 1980లో బీజేపీని ఏర్పాటు చేశారు. వాజపేయి బీజేపీ మొదటి అధ్యక్షులుగా ఉన్నారు.
8. 1984 ఇద్దరు సిక్కు అంగరక్షకులచే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. దీంతో ఢిల్లీలో సిక్కులపై దాడులు జరిగాయి. సిక్కులపై దాడిని ఖండించారు. 1984లో బీజేపీ లోకసభలో రెండు సీట్లను గెలిచింది. ఆ కాలంలో బీజేపీ అధ్యక్షుడిగా, విపక్ష నాయకుడిగా వాజపేయి ఉన్నారు.
9. అద్వానీ -వాజపేయిల నేతృత్వంలో బీజేపీ ఎదిగింది. 1995 నవంబర్లో ముంబైలో జరిగిన బీజేపీ సమావేశంలో అద్వానీ.. వాజపేయిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 1996 నుంచి 2004 వరకు మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.
10. 1974లో తొలిసారి పోక్రాన్ అణు పరీక్షల అనంతరం.. 24 ఏళ్ల తర్వాత వాజపేయి హయాంలో రాజస్థాన్లోని పోక్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను భారత్ నిర్వహించింది. పలు దేశాలు సమర్థించాయి. 1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్తాన్తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్య చర్యలు ప్రారంభించారు. లాహోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వాజపేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్.. పాక్పై గెలిచింది. 1999లోనే ఖాట్మాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేశారు. ప్రతిపక్షాలు, ప్రయాణీకుల కుటుంబాలు, రాజకీయ ఒత్తిళ్లతో హైజాకర్ల డిమాండుకు ఒప్పుకున్నారు. ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టారు. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన చేపట్టారు.