‘భారతరత్నకు వాజ్పాయి అప్పుడు నో చెప్పారు’
న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు తీసుకోమంటే.. ఎవరైనా కాదంటారా?. తమ నాయకులకు భారతరత్న ఇవ్వాలని దేశవావ్యాప్తంగా అనేకమంది ఏకంగా ఉద్యమాలు కూడా చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ పురస్కారం ఇస్తామన్నా.. ఓ వ్యక్తి వద్దని తిరస్కరించారు. ఆయనే మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పాయి. బుధవారం ఆయనకు ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో 1999 నాటి ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు, వాజ్పాయి ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా పనిచేసిన అశోక్ టాండన్ బయటపెట్టారు.
పాకిస్థాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన తర్వాత భారతరత్న అవార్డును తన పేరును ప్రతిపాదించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పాయిని కోరారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ లాంటి నేతలు కూడా దేశ ప్రధానులుగా ఉన్నప్పుడే భారతరత్న పొందినందున సొంతంగా పేరును ప్రతిపాదించుకోవటం తప్పేమీకాదని నచ్చజెప్పజూశారు.
కానీ, తమ సహచరుల వాదనను ప్రధానిగా ఉన్న వాజ్పాయి సున్నితంగా తిరస్కరించారు. అవార్డుకు పేర్లను ప్రతిపాదించే కీలక బాధ్యతల్లో ఉండి సొంతపేరును ప్రతిపాదించుకోవటం భావ్యంకాదని ఆయన స్పష్టం చేశారని టాండన్ వెల్లడించారు.