72 గంటల్లో మూడు ప్రమాదాలు: ట్రాఫిక్ రూల్స్ బేఖాతరు, ఎక్కడ.. ఎందుకంటే..?
ప్రపంచంలో పొడవైన అటల్ రోహ్తంగ్ టన్నెల్లో వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో మూడు యాక్సిడెంట్లు జరిగాయి. పర్యాటకులు వేగంగా వాహనాలు నడపడం, యువకులు బైకులపై రేసింగ్ చేయడంతో ప్రమాదాలు జరిగాయని బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించింది.
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్
కొందరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఫుటేజీ కూడా కనిపించింది. వాహనం రన్నింగ్లో ఉండగా కొందరు సెల్ఫీ తీసుకున్నారని బీఆర్వో చీఫ్ ఇంజనీర్ బ్రిగేడియర్ కేపీ పురుషోత్తం తెలిపారు. టన్నెల్ మధ్యలో వాహనాలు నిలుపొద్దని సూచించారు. అలా ఉంటే కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. టన్నెల్ లోపల సిబ్బందిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ అధికారులను కోరారు.
ఓవర్ స్పీడ్ వెళితే..
టన్నెల్ లోపల రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కులు ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. టన్నెల్ లోపల సీడ్ గన్స్ ఆధారంగా వేగంగా వెళ్లినవారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. టన్నెల్ లోపల గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని స్పష్టం చేశారు. టన్నెల్ లోపల రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలని గిరిజన శాఖ మంత్రి రామ్లాల్ మర్కంద స్థానిక అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
వీటిపై నిషేధం..
అటల్ రోహ్తంగ్ టన్నెల్ ద్వారా పేలుడు పదార్థాల రవాణాను బీఆర్వో నిషేధించింది. వచ్చే రెండు నెలలపాటు డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్పై తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 5 వరకు.. మొత్తం రెండు గంటలపాటు మెయింటెన్స్ నిమిత్తం టన్నెల్ మూసి ఉంటుందని తెలియజేసింది.
కారణమిదే..?
హర్యానాలోని 9.02 కిలోమీటర్ల పొడవు గల టన్నెల్ను ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లోనే మూడు ప్రమాదాలు జరిగాయని ‘ఔట్ లుక్' రిపోర్ట్ చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అజాగ్రత్తగా ఉండటంతోనే ప్రమాదాలు జరిగాయని వివరించింది. నిబంధనలు ఉల్లంఘించి డ్రైవ్ చేయడం, సెల్పీ తీసుకోవడంతో ప్రమాదాలు జరిగాయి.