అసోం : పరుగుల చిరుత హిమదాస్ డీఎస్పీగా నియామకం...
భారత స్టార్ అథ్లెట్, పరుగుల చిరుత హిమదాస్కు(21) అసోం ప్రభుత్వం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదవిని కట్టబెట్టింది. శుక్రవారం(ఫిబ్రవరి 26) జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ హిమదాస్కు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహాత్మ స్వయంగా హిమదాస్ యూనిఫాంపై స్టార్లను తొడిగి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హిమదాస్ మాట్లాడుతూ... తన చిన్ననాటి కల ఈరోజు నెరవేరిందన్నారు.' స్కూల్లో చదువుకునే రోజుల్లో నుండే పోలీస్ అధికారి కావాలన్న కోరిక ఉండేది. నా తల్లి కూడా అదే కోరుకుంది. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి క్రీడలే కారణం. కాబట్టి భవిష్యత్తులో అసోంను క్రీడా రంగంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తాను.' అని హిమదాస్ తెలిపారు. అసోం పోలీస్ విభాగంలోనూ తాను శ్రద్దగా పనిచేస్తానని... అదే సమయంలో స్పోర్ట్స్ విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేసేది లేదని అన్నారు. తనకు ఈ గౌరవాన్ని,హోదాను ఇచ్చినందుకు ముఖ్యమంత్రి సోనోవాల్కు,అసోం ఒలింపిక్ కమిటీకి,డీజీపీ భాస్కర్ జ్యోతికి హిమదాస్ కృతజ్ఞతలు తెలిపారు.
డీఎస్పీగా హిమదాస్ నియామకం యువతలో స్పూర్తిని నింపుతుందని ముఖ్యమంత్రి సోనోవాల్ అన్నారు. అసోం రాష్ట్రానికి ఇదో గర్వించదగ్గ రోజు అని అభిప్రాయపడ్డారు.
అసోంలోని నగావ్ జిల్లాలోని దింగ్ అనే కుగ్రామంలో అత్యంత పేద కుటుంబంలో హిమదాస్ జన్మించిన సంగతి తెలిసిందే. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామం నుంచి హిమదాస్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కాళ్లకు కనీసం సరైన చెప్పులు కూడా లేని స్థితిలో... బురద నేలలో వట్టి పాదాలతోనే హిమ చిరుతలా పరిగెత్తేవారు. చదువు కోసం హిమ జవహర్ నవోదయ పాఠశాలలో చేరడం... అక్కడ పీఈటీ ఆమెను ప్రతిభను గుర్తించడంతో హిమదాస్ అథ్లెటిక్స్లోకి అడుగుపెట్టారు. 2018లో ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచారు. ఈఘనత సాధించిన భారత తొలిమహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించారు.