ఏటీఎంలో రూ. 4 వేలు డ్రా చేస్తే రూ. 80 వేలు వస్తోంది: పరుగో పరుగు
మైసూరులో కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ. 4,000 డ్రా చేస్తే ఏకంగా రూ. 80,000 రావడంతో స్థానికులు షాక్ కు గురైనారు. జరిగిందంతా జరిగిపోయిన తరువాత ఇప్పుడు బ్యాంకు అధికారులు.
మైసూరు: మైసూరులో కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ. 4,000 డ్రా చేస్తే ఏకంగా రూ. 80,000 రావడంతో స్థానికులు షాక్ కు గురైనారు. జరిగిందంతా జరిగిపోయిన తరువాత ఇప్పుడు బ్యాంకు అధికారులు నగదు డ్రా చేసుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్లు చేసి డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నారు.
మైసూరులోని కుంబారకోప్ప ప్రాంతంలోని బస్ స్టాప్ లో కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రం ఉంది. స్థానికంగా నివాసం ఉంటున్న సుందరేష్ అనే వ్యక్తి శుక్రవారం ఏటీఎం కేంద్రంలో రూ. 4,000 డ్రా చెయ్యడానికి వెళ్లాడు.
సుందరేష్ నాలుగు వేల రూపాయలు డ్రా చేస్తే అతని చేతిలోకి రూ. 2,000 కొత్త నోట్లు రూ. 80 వేలు వచ్చాయి. ఆశ్చర్యానికి గురైన సుందరేష్ తన ఐదు మంది స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. ఐదు మంది వచ్చి రూ. 4,000 చొప్పున నగదు డ్రా చేస్తే మొత్తం రూ. 4 లక్షల రూపాయలు వచ్చింది.
అంతే షాక్ కు గురైన సుందరేష్ బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. బ్యాంకు అధికారులు పరుగున వచ్చి ఏటీఎం కేంద్రం మూసివేశారు. సుందరేష్, అతని స్నేహితులు నిజాయితీగా ఆ నగదు బ్యాంకు అధికారులకు అప్పగించారు.
ఏటీఎం కేంద్రాల్లో నగదు డిపాజిట్ చేస్తున్న సెక్యూర్ వ్యాల్యూ సంస్థ సిబ్బంది రూ. 100 నోట్లు పెట్టే చోట రూ. 2,000 నోట్లు పెట్టడం వలనే ఇలా జరిగిందని బ్యాంకు అధికారుల విచారణలో వెలుగు చూసింది. అప్పటికే పెద్ద మొత్తంలో నగదు డ్రా కావడంతో ఇప్పుడు ఆ ఖాతాదారుల వివరాలు తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది వారికి ఫోన్లు చేసి నగదు వెనక్కి తెచ్చి ఇవ్వాలని మనవి చేస్తున్నారు.