ఎటిఎం సెంటర్ల నుండి నకిలీ నోట్లు, ఖంగుతిన్న ఖాతాదారులు
కాన్పూర్: ఎటిఎం మెషిన్ల నుండి నకిలీ నోట్లు రావడంతో కష్టమర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ నోట్లతో తాము ఇబ్బందులు పడుతున్నామని కష్టమర్లు ఆవేదన చెందుతున్నారు. తమకు నోట్లను మార్చి ఇవ్వాలని కోరుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఏటీఎం మెషీన్ల నుండి నకిలీ నోట్లు రావడంతో ఖాతాదారులు ఖంగుతింటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లోని పలు ఏటీఎం మెషిన్ల నుండి నకిలీ నోట్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక మార్బుల్ మార్కెట్లో ఉన్న ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎమ్ నుంచి ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు నగదు విత్డ్రా చేశారు. అయితే అందులో నుండి నకిలీ రూ 500 నోట్లు రావడంతో ఖాతాదారుల ఆందోళన చెందారు.
ఆదివారం నాడు బ్యాంకుకు సెలవు కావడంతో సోమవారం నాడు నోట్లను మార్చుకోవాలని బ్యాంకు సెక్యూరిటీ గార్డు చెప్పారు. దీంతో ఖాతాదారులు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.మరికొందరికి కూడ ఇదే రకంగా నకిలీ నోట్లు రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఎటిఎం సెంటర్ను పోలీసులు మూసివేయించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని సౌత్ కాన్పూర్ ఎస్పీ తెలిపారు. అసలు నోట్లకు బదులుగా నకిలీ నోట్లు ఎటిఎం మెషిన్లకు ఎలా వచ్చాయనే విషయమై పోలీసులు విచారణ చేయనున్నారు.