ఏటిఎం: 5కు మించితే సొంత బ్యాంకులోనూ మోతే
న్యూఢిల్లీ: ఏ సమయంలోనైనా ఆర్థిక లావాదేవీలకు వీలు కల్పిస్తున్న ఏటిఎంలు ఇకనుంచి భారం కాబోతున్నాయి. సొంత ఖాతా కలిగిన బ్యాంకులు, ఇతర బ్యాంకుల నుంచి ఏటిఎంల ద్వారా ఒక నెలలో జరిపే ఉచిత లావాదేవీల సంఖ్యను ఆర్బీఐ మరింత కుదించింది. ఖాతావున్న బ్యాంకు నుంచి నెలకు ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే రూ. 20 చొప్పున చార్జీ పడుతుంది.
అలాగే ఇతర బ్యాంకుల ఎటిఎంలను మూడుదఫాలకు మించి ఉచితంగా వినియోగించుకోవడానికి వీలుండదు. నెలకు మూడుసార్లు ఈ లావాదేవీలు దాటితే 20 రూపాయల చొప్పున చార్జి పడుతుంది. కేవలం డబ్బు తీసుకోవడానికే కాదు, బ్యాలెన్స్ చూసుకోవడానికి ఎటిఎంను ఉపయోగించినా మీ ఉచిత అవకాశం ఒకటి హరించుకు పోయినట్టే అవుతుంది. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కొత్త నిబంధనలు శనివారం నుంచి అమలులోకి వస్తాయి.
కాగా, ఇతర బ్యాంకుల ఎటిఎంలలో తమ వినియోగదారులకు నెలలో ఉచిత లావాదేవీలను మూడుసార్లకు పైగా కల్పించడమన్నది ఆయా బ్యాంకుల నిర్ణయానికే వదిలేస్తున్నామని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. దేశవ్యాప్తంగా లక్షా అరవై వేల ఏటిఎంలు ఉన్నాయి. ఏటిఎంల నిర్వహణ వ్యయం పెరిగిపోతున్న దృష్ట్యా ఉచిత లావాదేవీల సంఖ్యను కుదించాలని, పరిమితి దాటితే చార్జీలను వసూలు చేసే అవకాశం కల్పించాలంటూ భారత బ్యాంకుల సంఘం చేసిన డిమాండ్ మేరకే రిజర్వ్ బ్యాంక్ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇక ఎలక్ట్రానిక్ టోల్ప్లాజాలు
న్యూఢిల్లీ: రోడ్డు భద్రతకు సంబంధించి రెండు ప్రధాన సంస్కరణలను మోడీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇందులో మొదటిది డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 350 టోల్ప్లాజాలను ఎలక్ట్రానిక్ టోల్ప్లాజాలుగా ఆధునీకరించడం కాగా, రెండోది 50 కోట్ల రూపాయలకన్నా తక్కువ పెట్టుబడి ఉన్న హైవేలను టోల్ప్రీగా చేయడం. దీనివల్ల ఇంధన వ్యయంలో దాదాపు 60 వేల కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికల్లా దేశవ్యాప్తంగా 350 టోల్ప్లాజాలు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ పద్ధతిని అమలు చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అంతేకాకుండా ‘50 కోట్ల రూపాయలకన్నా తక్కువ పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులపై టోల్ (సుంకం) వసూలును రద్దు చేయాలని నిర్ణయించాం. 27 టోల్ కేంద్రాలను రద్దు చేసాం. మరో ఏడాదిలో మరో 45 టోల్స్ను కూడా రద్దు చేస్తాం. వాటిని టోల్ఫ్రీ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం' అని గడ్కరీ చెప్పారు.
శుక్రవారం ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వల్ల నకిలీ టోల్ప్లాజాలకు అడ్డుకట్టపడుతుందని ఆయన చెప్పారు. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రతి ఒక్కటీ రికార్డు అవుతుందని, వాహనాల ట్రాఫిక్ను లెక్కవేయడం కూడా జరుగుతుందని ఆయన చెప్పారు.