విదేశాలకు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఎగుమతి: మోడీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రక్షణశాఖ అమ్ముల పొదిలో అత్యంత కీలకం, ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్.. ఇక విదేశాలకు ఎగుమతి కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థ ఇది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) దీనికి రూపకల్పన చేసింది.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్: కొత్త స్ట్రెయిన్పై ప్రభావం ఎంత?
ఈ మిస్సైల్ సిస్టమ్ను ఎగుమతి చేయడం ఇదే తొలిసారి. ఆకాశ్ క్షిపణుల వ్యవస్థను ఎగుమతి చేయడానికి అవసరమైన అనుమతులను జారీ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఎగుమతుల వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. కమిటీ ఏర్పాటుకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ఎంత మందిని నియమిస్తారు? అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద కేంద్రం కేబినెట్ ఈ క్షిపణి వ్యవస్థ ఎగుమతులకు ఉంచినట్లు రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పలు రకాల డిఫెన్స్ ప్లాట్ఫామ్స్, మిసైల్స్ తయారీ సామర్థ్యాలను క్రమంగా పెంచుకుంటున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనమని అన్నారు. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ 96 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందని రాజ్నాథ్ అన్నారు. ఉపరితలం నుంచి గగనతలంలో 25 కిలోమీటర్ల పరిథిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఆకాశ్ క్షిపణికి ఉందని అన్నారు.
ఇప్పటిదాకా రక్షణ రంగానికి సంబంధించిన విడి భాగాలు, ఇతర పరికరాలను ఎగుమతి చేస్తున్నామని ఆయన చెప్పారు. దేశ రక్షణ రంగ ఉత్పత్తులు మరింత మెరుగుపడటానికి, అంతర్జాతీయంగా పోటీపడటానికి మంత్రివర్గం తీసుకున్నతాజా నిర్ణయం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తం అయిదు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నలక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.