మోదీ సర్కార్ కీలక అడుగు- ఆర్మీలో ఆత్మనిర్భర్ - 101 విదేశీ వెపన్స్, వస్తువులపై ఆంక్షలు
'ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రక్షణ శాఖ అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి కలిపి మొత్తం 101 రకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాం. నిర్ణీత గడువులోపే ఈ నిర్ణయాన్ని అమలుచేస్తాం. ఇకపై రక్షణ పరికరాల్ని మనమే తయారు చేసుకుందుకు ఇదెంతో ఉపకరిస్తుంది''అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
Recommended Video
కరోనా అనంతర పరిస్థితుల్లో దేశ ఆర్థిక, తయారీ రంగం తిరిగి కోలుకునేలా, స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద పీట వేస్తూ ప్రధాని మోదీ ''ఆత్మనిర్భర్ భారత్'' నినాదం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టెలికాం సహా పలు శాఖలు విదేశీ దిగుమతులపై ఆంక్షలు విధించగా.. ఇప్పుడు రక్షణ శాఖ సైతం ఆత్మనిర్భర్ నినాదాన్ని అందిపుచ్చుకుంది. శాఖా పరంగా ఇదొక చరిత్రాత్మక ముందడుగని మంత్రి రాజ్ నాథ్ అన్నారు.
రక్షణ శాఖ ఆంక్షలు విధించనున్న 101 వస్తువుల జాబితాలో.. ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, సోనార్ సిస్టమ్స్, ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్టులు, లైట్ వెహికల్స్, రాడార్ల వంటి కీలక సంపత్తి కూడా ఉండటం గమనార్హం. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు విపరీతంగా అవకాశం కల్పించడం, ఇటీవలే ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్ కు ఎక్కువ ధర చెల్లించారనే విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విదేశీ వస్తువుల దిగుమతలుపై మోదీ సర్కార్ ఆంక్షలు విధించడం కీలకంగా మారింది.