కుండబద్దలు కొట్టిన నిర్మలమ్మ: విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు: అమ్మకానికి 6 విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పట్టింది. అలా, ఇలాక్కాదు. ప్రజలను నేరుగా ప్రభావితం చేయబోయే కీలక రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పనిలో పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టింది. ఎనిమిది కీలక రంగాల్లో సంస్కరణలకు తెర తీశామని ప్రకటించిన నిర్మలా సీతారామన్.. వాటన్నింట్లోనూ ప్రైవేటు సంస్థలు అడుగు పెట్టడానికి అవకాశాన్ని కల్పించారు.
Recommended Video
నిర్మలమ్మ అష్టజపం: బొగ్గు బాక్సైట్ గనులు ప్రైవేటుపరం: రక్షణ తయారీలో 74% విదేశీ పెట్టుబడులు
కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిస్కమ్లు ప్రైవేటీకరణ
ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలగడానికి కారణమయ్యే విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించడం శనివారం నిర్మలా సీతారామన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైలైట్గా చెప్పుకోవచ్చు. అదొక్కటే ఏంటీ? రక్షణరంగ ఉత్పత్తుల్లో 74 శాతం మేర విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. బాక్సైట్ తవ్వకాల్లో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చారు. బొగ్గు బ్లాకులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకోవడానికి ప్రైవేటు సంస్థలకు ఛాన్స్ ఇచ్చారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికేనంటూ..
దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన జమ్మూ కాశ్మీర్, లడక్ సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్)ను ప్రైవేటీకరించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనివల్ల విద్యుత్ పంపిణీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఉద్యోగాల భద్రత, బిల్లింగ్, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రైవేటు సంస్థల నుంచి హామీలను తీసుకుంటామని చెప్పారు. డిస్కమ్లను ప్రైవేటీకరించడం వల్ల చివరికి వినియోగదారుడికే లబ్ది కలుగుతుందని అన్నారు. పారిశ్రామిక రంగానికి, ప్రైవేటు సంస్థలకు ఊతం కల్పించినట్టు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆరు విమానాశ్రయాలు వేలానికి
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆరు విమానాశ్రయాలను కూడా ప్రైవేటు సంస్థకు విక్రయించబోతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వాటిని విక్రయించడానికి త్వరలోనే వేలంపాటలను నిర్వహిస్తామని అన్నారు. పౌర విమానయానాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారామె. భారత గగనతలాన్ని వినియోగించుకోవడానికి ఇప్పటిదాకా ఉన్న ఆంక్షలను కూడా సరళీకరించబోతున్నామని అన్నారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద విమానాశ్రయాల నిర్వహణను మెరుగుపర్చడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. రెండోదశలో మరో ఆరు విమానాశ్రయాలను తాజాగా ప్రైవేటీకరిస్తామని అన్నారు.
సామాజిక మౌలిక రంగాల్లోనూ ప్రైవేటుకు ఛాన్స్
సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఇవ్వబోతున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్)ను భర్తీ చేసుకోవడానికి 8,100 కోట్ల రూపాయల నిధులతో ఓ పథకాన్ని రూపొందించామని అన్నారు. ప్రతి ప్రాజెక్టులో కూడా 30 శాతం మేర వీజీఎఫ్ను పెంచినట్లు తెలిపారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఊతం కల్పించినట్టు అవుతుందని తెలిపారు. దాదాపు అన్ని కీలక రంగాల్లోనూ ప్రైవేటు భాగస్వామ్యానికి తెర తీసినట్టయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.