పాక్ తలలు నరుకుతుంటే మీరేం చేస్తున్నారు?: మోడీకి బ్లౌజ్ పంపిన మాజీ సైనికుడి భార్య
పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు తరచూ దాడులు చేస్తూ భారత సైనికులు, ప్రజల ప్రాణాలు తీస్తున్నా.. వారికి తగిన గుణపాఠం చెప్పడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ఓ మాజీ సైనికుడి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం
ఫతేహాబాద్: పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు తరచూ దాడులు చేస్తూ భారత సైనికులు, ప్రజల ప్రాణాలు తీస్తున్నా.. వారికి తగిన గుణపాఠం చెప్పడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ఓ మాజీ సైనికుడి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, ప్రధానికి మహిళలు ధరించే బ్లౌజ్ను తన లేఖతోపాటు పంపించారు.
'ధైర్యానికి ప్రతీక అని చెప్పుకుంటున్న మీ 56 అంగుళాల ఛాతి ఏమైంది? మన బలగాలపై పాకిస్థాన్ జరుపుతున్న దాడులను నివారించలేక పోతున్నారెందుకు? గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే.. భారతవైపు పాక్ కన్నెత్తిచూసే సాహసం కూడా చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కదా? మరి.. ఇప్పుడేమైంది? పరిస్థితులు గతంలోకన్నా దారుణంగా మారా యి' అంటూ ప్రధాని మోడీకి ఓ మాజీ సైనికుడి భార్య లేఖ రాశారు.
అంతేగాక, పాక్ దాడులను ప్రధాని నివారించలేకపోతున్నారని నిరసిస్తూ తన లేఖతో పాటు 56అంగుళాల జాకెట్(బ్లౌజు)నూ ఆమె పంపారు. పాక్ ఆట కట్టించేందుకు ఆర్మీకి పూర్తి అధికారాలివ్వాలని లేఖలో ఆమె ప్రధానిని కోరారు. మన సైనికుల తల తెగనరుకుతున్నారని, కాశ్మీర్లోనూ కొందరు ఉగ్ర ప్రేరిపిత యువకులు సైనికులపై ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
ఈ మేరకు తన భార్య సుమన్ సింగ్ రాసిన లేఖ, జాకెట్ను... మాజీ సైనికుడు ధరమ్వీర్ శుక్రవారం ఫతేహాబాద్లోని 'జిల్లా సైనిక్ బోర్డు' అధికారులకు అందజేశారు. ఒక మాజీ సైనికుడి భార్యగా.. 'ఆ 56 అంగుళాల ఛాతి ఇప్పుడు ఎక్కడికి పోయింది' అని ప్రధానిని సుమన్ సింగ్ ప్రశ్నించిందన్నారు. తాను, 1991 నుంచి 2007 వరకు ఆర్మీలో పనిచేశానని, కొద్దికాలం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జిల్లా పరిశీలికుడిగా పనిచేశానని ధరమ్వీర్ తెలిపారు.