మోడీ ఆమోదం: చైనాకు పోటీగా రూ. 50 వేల కోట్లతో యుద్ధ నౌకలు
బెంగుళూరు: భారతీయ సముద్ర జలాల్లో చైనాకు దీటుగా యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని భావిస్తున్న భారత్ ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా అత్యాధునిక యుద్ధ నౌకల కోసం 8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 50 వేల కోట్లు) విలువైన ప్రణాళికకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
హిందూ మహా సముద్రంలో చైనా నౌకాదళంతో పాటీ పడాలంటే ఆధునిక జలాంతర్గాములు అవసరం ఎంతైనా ఉందని భావించిన మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
భవిష్యత్తులో చైనా, పాకిస్ధాన్లతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే ప్రస్తుతం ఉన్న భారత్ శక్తి సామర్ధ్యాలు చాలవని రక్షణ శాఖ వర్గాలు హెచ్చిరించాయి. దీంతో పాటు గత కొంతకాలంగా చైనా జలాంతర్గాములు శ్రీలంక నౌకాశ్రయాల్లో ఉండటంతో భారత్ రక్షణ శాఖ వర్గాల్లో భయాలు మరింతగా పెరిగాయి.
దీంతో, మంత్రివర్గ సహచరులతో భేటీ అయిన ప్రధాని మోడీ, రాడార్లకు దొరకని విధంగా, శత్రు సైన్యంపై విరుచుకుపడేందుకు వీలుగా ఉండే 7 యుద్ధ నౌకలను సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు అణు బాంబులు ప్రయోగించే విధంగా ఉండే ఆరు జలాంతర్గాములను కూడా సమకూర్చాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీని కోసం 2012 నుంచి కేబినెట్ ఆమోదం కోసం వేచిఉన్న ప్రాజెక్ట్ 17-ఎ'కి ఆమోదం తెలిపారు. వీటిని ముంబై, కోల్కత్తాలలోని షిప్ యార్డుల్లో 'ప్రాజెక్ట్ 17-ఎ' పేరిట తయారు చేయనున్నట్లు సమాచారం. రాబోయే నెల రోజుల్లో వీటి నిర్మాణం మొదలవనుంది. గత ఏడాది అక్టోబర్లో విదేశీ బిల్డర్ సహకారంతో ఆరు జలాంతర్గాములు వేగంగా నిర్మించడానికి టెండర్ ప్రక్రియకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.