ఐపీఎల్ దెబ్బ, 780 మంది మీద కేసులు, సీమాన్ మీద హత్యాయత్నం కేసు, స్టాలిన్ ఫైర్ !
Recommended Video
చెన్నై: కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని తమిళనాడు ప్రభుత్వం పోలీసు పవర్ తో అరెస్టు చేయించిందని, 780 మంది మీద కేసులు ఎత్తివేసి వెంటనే వారిని విడుదల చెయ్యాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రముఖ దర్శకుడు సీమాన్ మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
లాఠీచార్జ్ చేస్తారా !
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే వరకు చెన్నైలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించరాదని స్టేడియం సమీపంలోని వల్లాజ రోడ్డులో నిరసన వ్యక్తం చేస్తున్న వారీ మీద పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఎంకే. స్టాలిన్ ఆరోపించారు.
ప్రజల సెంటిమెంట్
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలనే ప్రజల సెంటిమెంట్ మీద తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు దెబ్బకొట్టాయని ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. కావేరీ సమస్య తమిళనాడు ప్రజల అందరి సమస్య అని ఎంకే. స్టాలిన్ గుర్తు చేశారు.
780 మంది మీద కేసులు
ప్రముఖ దర్శకుడు భారతీరాజా, గేయ రచయిత వైరముత్తు, నామ్ తమిళర్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు, దర్శకుడు సీమాన్ తో సహ మొత్తం 780 మంది మీద గ్రేటర్ చెన్నై పోలీసులు కేసులు నమోదు చేశారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు కోసం ఆందోళన చేసిన వారి మీద వెంటనే కేసులు ఎత్తివేయాలని ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
హత్యాయత్నం కేసు
మంగళవారం సాయంత్రం చెన్నై నగరంలోని అన్నాసరై ప్రాంతంలో ఆందోళన చేస్తున్న కొందరు కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల మీద దాడి చేసిన కేసులో ప్రముఖ దర్శకుడు, నామ్ తమిళర్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు సీమాన్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
పళనిస్వామి ప్రభుత్వం
పోలీసులను అడ్డం పెట్టుకుని కావేరీ పోరాటాన్ని తప్పుదోవపట్టిస్తున్న ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం పతనం తప్పదని ఎంకే. స్టాలిన్ హెచ్చరించారు. వెంటనే అమాయకుల మీద నమోదు చేసిన కేసులు ఎత్తివేసి కావేరీ పోరాటం చేస్తున్న వారికి సహకరించాలని, లేదంటే పరిస్థితి వేరుగా ఉంటుందని తమిళనాడు ప్రభుత్వాన్ని ఎంకే. స్టాలిన్ హెచ్చరించారు.