ప్రాణం తీసిన సెల్ఫీ సరదా: ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
నమక్కల్: యువతలో సెల్ఫీ పిచ్చి పెరిగిపోతోంది. మంచి సెల్ఫీలు తీసుకోవాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇలాంటి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించి చనిపోయిన వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోతుండటం ఆందోళనకరమైన అంశంగా మారింది.
తాజాగా, తమిళనాడులోని నమక్కల్లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ ఇంజినీరింగ్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. ఇంజనీరింగ్ చదువుతున్న ప్రకాశ్ అనే విద్యార్థి ఆరుగురు స్నేహితులతో కలిసి నమ్మక్కల్కు 65కి.మీ.ల దూరంలోని కోలి హిల్స్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ జలపాతాల వద్ద స్నానం చేసి తర్వాత అందరూ కొండలపై సెల్ఫీలు తీసుకున్నారు.
ప్రకాశ్ కూడా కొండ చివర సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు జారి 60 అడుగుల కిందికి పడిపోయాడు.
తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.