రెక్కీ చేశాం: 'బాల్ థాకరేను చంపాలనుకున్నాం'
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను హతమార్చాలని అప్పట్లో ప్లాన్ వేసినట్లు పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ తెలిపారు. ముంబై 26/11 దాడి కేసులో అప్రూవర్గా మారిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ గురువారం ప్రారంభమైంది. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు అతడిని విచారిస్తోంది.
ఈ విచారణ నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈరోజు కోర్టుకు మరిన్ని వివరాలను వెల్లడించాడు. లష్కరే ఈ తోయిబా అగ్రనేత సాజిద్ మీర్ ఆదేశాల మేరుకు బాల్ థాకరేను చంపాలనుకున్నట్లు హెడ్లీ తెలిపాడు. సాజిద్ మీర్ ఆదేశాలతో తాను ముంబైలోని సేనా భవన్కు కూడా వెళ్ళానని తెలిపాడు.
థాకరేను లష్కరే ఈ తోయిబా ఎందుకు చంపాలనుకుందో తనకు తెలియకపోయినా.. చంపడమే లక్ష్యం కావడంతో ప్రయత్నం మాత్రం చేశానని క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో హెడ్లీ వెల్లడించాడు. ఇందుకోసం రెక్కీ కూడా వేయాలనుకున్నాం, దాని కోసం రెండుసార్లు ముంబైలోని శివసేన భవన్కు వెళ్లినట్లు హెడ్లీ కోర్టుకు తెలిపాడు.
థాకరేను చంపేందుకు ఓ ఉగ్రవాది ప్రయత్నించాడని, అయితే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నాడు. ఆ తర్వాత అతడు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడని తాజా విచారణలో హెడ్లీ వెల్లడించాడు. అమెరికా కోర్టులో క్షమాభిక్ష అనేది లేదని, ముంబై కోర్టులో మాత్రం గతంలో క్షమించమని అభ్యర్థన చేసినట్లు హెడ్లీ చెప్పాడు.
ముంబై కోర్టుకు సత్యాలను వెల్లడించినంత మాత్రన తనకు అమెరికా కోర్టులో రక్షణ దొరకదన్నాడు. అమెరికా పాస్పోర్టులో పేరు మార్చుకునేందుకు అక్కడి అధికారులకు ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని హెడ్లీ స్పష్టం చేశాడు. అబూ జుందాల్ లాయర్ అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో హెడ్లీని విచారిస్తున్నారు.
ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ముంబై 26/11 ఉగ్రదాడి సమయంలో లష్కర్ ఈ తోయిబా ముంబై ఎయిర్ పోర్ట్ని కూడా టార్గెట్ చేసినట్లు మంగళవారం నాటి విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే.