అస్థిత్వాన్ని హననం చేసే ప్రయత్నం జరిగింది..! లోక్ సభలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని..!!
దిల్లీ/హైదరాబాద్ : లోక్సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. పదునైన పదజాలం, ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత తొలిసారి లోక్సభలో మాట్లాడిన ఆయన.. దాదాపు గంటపాటు నిశిత విమర్శలు గుప్పించారు. అత్యయిక పరిస్థితి విధించి భారతదేశపు ఆత్మను కాంగ్రెస్ పార్టీ ఛిద్రం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చీకటి రోజులను ఏనాటికీ మర్చిపోలేమన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు తప్ప వేరెవ్వరి కృషినీ కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని మండిపడ్డారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు లోక్సభలో ఆయన మంగళవారం సమాధానమిచ్చారు. అనంతరం ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. మోదీ మాట్లాడుతూ కొంతమంది ఇంకా ప్రచారపు హ్యాంగోవర్ నుంచి బయటపడలేదని విమర్శించారు. బాగా ఎదిగిపోవడం వల్ల క్షేత్రస్థాయితో వారి సంబంధాలు తెగిపోయాయని, కానీ తమ కాళ్లు మాత్రం ఎప్పుడూ భూమ్మీదే ఉండటం వల్ల క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించబోమని అన్నారు. భారతదేశం అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందేందుకు ఎంపీలంతా పార్టీలకు అతీతంగా సమష్టిగా కృషిచేయాలని సూచించారు. పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా ముఖ్యమని.. దాంతో ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.
వారిని ఏనాడైనా గుర్తించారా..? ప్రణబ్కు భారతరత్న ఇచ్చింది మేమే నన్న మోదీ..!!
మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్పేయీ, పీవీ నరసింహారావు లాంటివాళ్లు చేసిన మంచి పనుల గురించి కాంగ్రెస్ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. బీజేపి ప్రభుత్వమే ప్రణబ్ముఖర్జీకి భారతరత్న ప్రదానం చేసిందని గుర్తుచేశారు. పీవీ, మన్మోహన్లకు ఈ గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ భావించలేదన్నారు. 'జాతి పురోగతికి కొంతమందే సేవలందించారని కొందరు అనుకుంటారు. వాళ్లు కొన్నిపేర్లే వినాలనుకుంటూ ఇతరులను వదిలేస్తారు. మేం దేశ పురోగతి కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరినీ పట్టించుకుంటాం. వాళ్లు ఎప్పుడైనా పీవీ నరసింహారావు చేసిన మంచిపనుల గురించి మాట్లాడారా? ఈ లోక్సభ చర్చలో.. కనీసం మన్మోహన్ సింగ్ గురించి కూడా మాట్లాడలేదు' అని ఆయన చెప్పారు. షా బానో కేసు విచారణ సమయంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కేంద్ర మాజీమంత్రి ఒకరు ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని, అందులో.. 'ముస్లింలను ఉద్ధరించడం మా పార్టీ పని కాదు. వాళ్లు బురదలో పడి ఉంటామంటే అక్కడే ఉండనివ్వండి' అన్నారని మోదీ గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కాగా, కావాలంటే వారికి ఇంటర్వ్యూ యూట్యూబ్ లింకు పంపుతానన్నారు.
ఆ కుటుంబాన్ని తప్ప వేరెవరినీ గుర్తించలేదు..! పీవీ పనుల గురించి ఏనాడూ మాట్లాడలేదని మోదీ విమర్శలు..!!
ముస్లిం మహిళల సాధికారతకు ఉన్న మరో అవకాశాన్ని వదులుకోవద్దని, ముమ్మారు తలాక్ బిల్లుకు మద్దతివ్వాలని కాంగ్రెస్కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ స్థాయి చాలా పెద్దదన్న అధీర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలను ప్రధాని మోదీ దునుమాడారు. వాళ్లు ఎంత ఎత్తు ఎదిగితే తాను అంత సంతోషిస్తానని, అలా ఎదగడం ద్వారా వాళ్లు దేశ మూలాలతో సంబంధాలు కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు పైకి ఎదగడంలో బిజీ అయిపోయి నేలమీద కాళ్లు ఆనడం లేదన్నారు. తమకు అంత ఎత్తు ఎదగాలన్న కోరిక లేదని, నేలమీదే.. దేశవాసులతో కలిసి చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ఫలానా వ్యక్తులు జైల్లో ఎందుకు లేరని కొందరు అడుగుతున్నారు. అవినీతిపై మా పోరాటం కొనసాగుతుంది గానీ, ప్రతీకారం తీర్చుకునేలా ఉండదు.
భారత ఆత్మను ఛిద్రం చేశారు..! కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోదీ..!!
వాళ్లను జైల్లో పెట్టాలా.. బెయిల్ ఇవ్వాలా అన్న విషయాన్ని కోర్టులే చూసుకుంటాయి. ఇది ఎమర్జెన్సీ కాదు. అప్పట్లో ప్రభుత్వాలే తమ ఇష్టం వచ్చినట్లు జైల్లో పెట్టాయి. అత్యయిక పరిస్థితి భారత ప్రజాస్వామ్యం మీద మచ్చ లాంటిది.. అదెన్నటికీ చెరిగిపోదు. అప్పట్లో ఇదే రోజు (జూన్ 25) అత్యయిక పరిస్థితిని విధించడం ద్వారా భారతదేశపు ఆత్మను ఛిద్రం చేసేశారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చాలా గొప్పవారు. ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తూ సమాజంలో కూడా అవగాహన కల్పించాలి. అంబేడ్కర్ ఎప్పుడూ దేశాభివృద్ధిలో రక్షిత తాగునీటి ఆవశ్యకత గురించి చెప్పేవారు. రాంమనోహర్ లోహియా కూడా దేశ మహిళలకు రక్షిత తాగునీరు, మరుగుదొడ్ల అవసరం ప్రస్తావించేవారు. మా ప్రభుత్వం ఇన్నాళ్లూ మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టిసారించింది. ఇపుడు జల్శక్తి మంత్రిత్వశాఖ తాగునీటిపై దృష్టిపెడుతుంది.
అది మా విజయమే..! లోక్ సభలో మోదీ కౌంటర్ ఇచ్చిన పక్షనేత అధీర్ రంజన్ చౌధురి..!!
గతంలో ఒక్క కాంగ్రెస్ నేత పేరును కూడా తన ప్రసంగాల్లో పలికేందుకు మోదీ నిరాసక్తంగా ఉండేవారని, అలాంటిది ఈసారి నెహ్రూ పేరు ప్రస్తావించారంటే అది తమ విజయమేనని కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌధురి అన్నారు. వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగం నుంచి కనీసం బిహార్లోని ఏఈఎస్ సమస్య లాంటి ముఖ్యమైన అంశాలను ఆయన ప్రస్తావించలేదని విమర్శించారు. మోదీ ఎంత సేపూ తాత్కాలిక ప్రయోజనాల గురించే ప్రస్తావిచారు తప్ప దీర్గకాలిక సమస్యల పరిష్కారం గురించిగాని, దీర్గ కాలిక రాజకీయ ప్రయోజనాల గురించి గాని ప్రస్తావించలేదని తెలిపారు. ప్రణాళికా బద్దంగా వెళ్లడం మోడీకి తెలియదు కాబట్టే అదిశగా ప్రసంగించలేక పోయారని చౌదురి విమర్శించారు.