నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్
దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఆ తర్వత దిద్దు బాటు చర్యలకు దిగారు.
ఆ దేశంలో కాంగ్రెస్కు మంచి టీఆర్పీలు: జైట్లీ
రాఫెల్తో మోడీ సర్కార్ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా..?
దేశంలో మరికొన్నిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. విపక్షాలకు అస్త్రంగా మారిన రాఫెల్ వివాదంలో పూటకో మాట చెబుతూ అడ్డంగా దొరికిపోతోంది ప్రభుత్వం. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం చౌకబారు మాటలతో విమర్శల పాలవుతోంది. ఇందుకు నిదర్శనం దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ అంశమే.
మొన్న చోరీ అన్న ఏజీ నేడు చోరీ జరగలేదంటూ వ్యాఖ్యలు
రెండు రోజుల క్రితం రక్షణశాఖ నుంచి రాఫేల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్ వెంటనే మాట మార్చారు. డాక్యుమెంట్లు చోరీకి గురికాలేదని... పిటిషన్ వేసిన పిటిషనర్ ఒరిజినల్ డాక్యుమెంట్లను ఫోటోకాపీ తీసుకుని సమర్పించారని చెప్పడమే తన ఉద్దేశమని కేకే వేణుగోపాల్ అన్నారు. అదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి తెలపాలన్నదే తన ఉద్దేశం అన్నారు. రక్షణశాఖ కార్యాలయం నుంచి రాఫెల్ డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని తాను సుప్రీంకోర్టుకు వెల్లడించినట్లు విపక్షాలు విమర్శిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అయితే విపక్షాల ఆరోపణలు సత్యదూరమైనవని అన్నారు. ప్రభుత్వం తరపున ఓ టాప్ లీగల్ అధికారి రాఫెల్ డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు తెలపడంపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేకే వేణుగోపాల్ నష్ట నివారణ చర్యలకు దిగారు.
విపక్షాల చేతికి అస్త్రం అందించిన ఏజీ
బుధవారం జరిగిన వాదనల సందర్భంగా డాక్యుమెంట్లను పిటిషనర్ చోరీచేశారని దానిపై ఆదారపడకూడదని కోర్టులో వాదనలు వినిపించారు కేకే వేణుగోపాల్. డాక్యుమెంట్లు చోరీ చేసి తమతో తీసుకురావడం క్రిమినల్ చర్య అవుతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రక్షణ కార్యాలయం నుంచి రహస్యంగా ఉండాల్సిన పేపర్లు ఎలా చోరీకి గురయ్యాయో దీనిపై విచారణ వేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాఫెల్కు సంబంధించి రహస్యంగా ఉండాల్సిన పత్రాలను బహిర్గం చేయడమంటే చట్టాన్ని ఉల్లంఘించారని వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని చెప్పిన ఆయన ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు ఎందుకు చేయలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయంటూ వత్తాసు పలికిన సంగతి తెలిసిందే.