ఆగస్టు 22న బీబీఎంపీ ఎన్నికలు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 22వ తేదిన బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించి, అదే నెల 25వ తేదిన ఫలితాలు వెల్లడించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల అధికారులు జులై 28వ తేదిన బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత సమయం కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 8 వారాల లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఇస్తున్నామని సుప్రీం కోర్టు చెప్పింది.
కొత్తగా ఎన్నికల తేదిని ప్రకటించాలని సుప్రీం కోర్టు ఎన్నికల అధికారులకు సూచించింది. గురువారం సాయంత్రం ఎన్నికల అధికారులు బీబీఎంపీ ఎన్నికల తేదిని ప్రకటించారు. జులై 17వ తేది నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.
ఆగస్టు 10వ తేది వరకు నామిషన్లు వెయ్యడానికి అవకాశం ఉంది. ఆగస్టు 11వ తేదిన నామినేషన్లు పరిశీలిస్తారు. ఆగస్టు 13వ తేదిన నామినేషన్లు ఉపసంహరించడానికి అవకాశం ఉంది. ఆగస్టు 22వ తేది పోలింగ్ జరుగుతుంది. అవసరం అయితే 24వ తేదిన రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.