ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కు చివరి తేదీ ఆగష్టు 31...కట్టలేదంటే భారీ జరిమానా
న్యూఢిల్లీ: 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించేందుకు ఆగష్టు 31 చివరి రోజు. శనివారం రోజున ఆదాయపు పన్ను చెల్లించకపోతే... భారీ జరిమానాతో కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే చివరితేదీగా ఆగష్టు 31వ తేదీ వరకు ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ను దాఖలు చేసేందుకు పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ. వాస్తవంగా జూలై 31వ తేదే చివరి తేదీగా ఉన్నింది. అయితే ఆదాయపు పన్ను చెల్లించేందుకు చివరితేదీని ప్రభుత్వం పొడగించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వం తెలిపింది. ఆగష్టు 31వ తేదీనే చివరి తేదీ అని స్పష్టం చేసింది.
ఇక ఆగష్టు 31లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని పక్షంలో మరో ఆప్షన్ కూడా ఉంది. ఆదాయపు పన్ను శాఖ ఏడాదికి సంబంధించిన ట్యాక్స్ అసెస్మెంట్ పూర్తి చేయకముందే ఆదాయపు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అంటే మార్చి 31,2020లోపు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది జరిమానాతో కట్టాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత ఇన్కంట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5వేల జరిమానాతో కట్టాల్సి ఉంటుంది. ఇక జనవరి నుంచి మార్చి 31 మధ్యలో ఇన్కంట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే అప్పుడు రూ.10వేల జరిమానాతో కట్టాల్సి ఉంటుంది.
ఇక నిర్ణీత గడువులోగా వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించనివారు, వారి ఏడాది ఆదాయం రూ. 5లక్షలు ఉంటే రూ. 1000 ఎక్కువగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇన్కంట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయకు ముందే పెనాల్టీలు ఇతర డ్యూస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక గడువు తర్వాత ట్యాక్స్ ఫైల్ చేసేవారు ప్రతి నెలకు 1శాతం వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుంది. ఇది ఇన్కంట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 234 ఏ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత ఆదాయపు పన్ను కట్టకుండా ఎగవేస్తే అధికారుల నుంచి నోటీసులు అందుతాయని, కొన్నిసార్లు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జైలు శిక్ష ఎంతకాలం ఉంటుందనేది కట్టాల్సిన ఆదాయపు పన్నుపై ఆధారపడి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.