జాగ్రత్త! భారత్లో తీవ్రవాద దాడులు జరగొచ్చు: ఆస్ట్రేలియా హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత దేశంలో ఉగ్రవాదదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రభత్వం బుధవారం హెచ్చరించింది. భారత్లోని అన్ని ప్రాంతాలలోను దాడులు జరిగే అవకాశమున్నట్లు ఆస్ట్రేలియన్ పర్యాటక శాఖ ప్రభుత్వ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి తమకు హెచ్చరికలు అందాయని పేర్కొంది.
ఆర్థిక రాజధాని ముంబై నగరం మీద ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. భారత దేశానికి వెళ్లే ప్రయాణీకులకు ఆస్ట్రేలియా పర్యాటక శాఖ హెచ్చరించింది. ముంబై నగరంలోని హోటళ్లలో దాడులు జరుగవచ్చునని పేర్కొంది. స్మార్ట్ ట్రావెల్లర్.జీఓవి.ఏయు అనే వెబ్ సైట్లో పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ నగరాలతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అసలు వెళ్లవద్దని తమ దేశ ప్రయాణీకులకు సూచించింది. భారత దేశం పైన దాడులు చేస్తారనే సమాచారం తమకు తరచుగా వస్తోందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ప్రధానంగా భారత దేశానికి సరోగసి కోసం వెళ్లే ఆస్ట్రేలియన్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
సరిహద్దు భద్రత ఏర్పాట్లపై బీఎస్ఎఫ్ సమీక్ష
రాజస్థాన్ రాష్ట్రంలోని పాక్ సరిహద్దు వెంబడి ఉన్న సరిహద్దుల్లో అధికారులు భద్రత పెంచారు. భద్రత ఏర్పాట్లను బీఎస్ఎఫ్ అదనపు డీజీ కేకే శర్మ సమీక్షించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తీర ప్రాంత రక్షణకు మూడంచెల భద్రత కల్పించనున్నట్లు చెప్పారు.