ఇవాంకా ట్రంప్కు షాక్ : ఆమెతో భేటీ అయిన ఆస్ట్రేలియా మంత్రికి కరోనా పాజిటివ్..
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని స్తంభించిపోయే స్థితిలోకి నెట్టివేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గంటగంటకూ పెరుగుతోన్న కొత్త కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారులు,మంత్రులు సైతం కరోనా బారిన పడుతుండటంతో.. ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో దేశాల్లో పలువురు ఉన్నతాధికారులు,మంత్రులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా హోంశాఖ మంత్రి పీటర్ డుట్టన్కు కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. గతవారం అమెరికా పర్యటనలో ఇవాంకా ట్రంప్తో భేటీ అయిన కొద్దిరోజులకే డుట్టన్కు పాజిటివ్గా తేలడం అమెరికా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్వయంగా ప్రకటించిన ఆస్ట్రేలియా మంత్రి
కరోనా పాజిటివ్ను నిర్దారిస్తూ శుక్రవారం డుట్టన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం తాను లేచేసేరికి జ్వరం,గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని తెలిపారు. దాంతో స్థానిక ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు. పరీక్షల్లో తనకు కోవిడ్-19 సోకినట్టు తేలిందన్నారు.
గతవారం ఇవాంకాతో భేటీ
డుట్టన్ గతవారమే అమెరికాలో పర్యటించారు. బాల కార్మిక వ్యవస్థ,చిన్నారులకు సంబంధించిన పలు అంశాలపై అమెరికన్ అధికారులతో చర్చలు జరిపారు. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు,ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్తో ఇవాంకాతోనూ భేటీ అయ్యారు. మార్చి 5న డుట్టన్ ఆమెతో దిగిన ఫోటో బయటకొచ్చింది. ఫోటోలో ఇవాంకాకు డుట్టన్ ఎడమవైపు నిలుచుని ఉన్నారు. తాజాగా డుట్టన్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇవాంకా పరిస్థితేంటా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్ట్రేలియాలో మొత్తం 156 పాజిటివ్ కేసులు
కరోనావైరస్ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) బుధవారం(మార్చి 11) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 156 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. వైరస్ పుట్టుకొచ్చిన చైనాలో ఇప్పటివరకు 80981 మంది ఈ మహమ్మారి బారినపడగా.. 3173 మంది చనిపోయారు. కొత్తగా ఇథియోపియాలోనూ కరోనా మొదటి పాజిటివ్ కేసు నమోదైంది.