ఢిల్లీలో ఆటో అంబులెన్సులు.. ఆక్సిజన్ సపోర్ట్ , పీపీఈ కిట్ తో డ్రైవర్, కరోనా బాధితులకు ఉచిత సేవలు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టించింది. ఢిల్లీలో ఆసుపత్రులలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ఆసుపత్రిలో వైద్య వసతుల లేమి ఆక్సిజన్ కొరత ఢిల్లీని వేధిస్తోంది.మరోవైపు అంబులెన్సుల కొరత కూడా ఎదుర్కొంటున్న ఢిల్లీలో ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న అంబులెన్స్ లపై భారం తగ్గించడానికి,ఆక్సిజన్ మద్దతు అవసరమయ్యే స్వల్ప కరోనా లక్షణాలతో ఉన్న కోవిడ్ రోగులకు సేవ చేయడానికి 10 ఆటో అంబులెన్సులను ఢిల్లీలో ప్రారంభించారు.
ప్రతి ఆటో అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ మరియు శానిటైజర్
రోగులు ఆసుపత్రులకు చేరుకోవడానికి అంబులెన్స్లుగా మార్చబడిన ఈ ఆటోలు కరోనా బాధితులకు ఉచిత సేవలను అందిస్తాయి. ప్రతి ఆటో అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ మరియు శానిటైజర్ అమర్చబడింది. దేశ రాజధాని ఢిల్లీలో టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ సంస్థ, రాజ్యసభ సహకారంతో ఆటో అంబులెన్స్ లను సిద్ధం చేసింది.ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ టివైసిఐఏ ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ ఆటో అంబులెన్స్లను 85 నుంచి 90 మధ్య ఆక్సిజన్ స్థాయి ఉన్న తేలికపాటి రోగలక్షణ రోగులు సకాలంలో సమీప ఆసుపత్రులకు చేరుకునేలా చూడాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టారన్నారు.
పిపిఇ కిట్లు ధరించిన డ్రైవర్లతో ఆటో అంబులెన్స్లు, మే 6 నుండి 20 ఆటో సర్వీసులు
పిపిఇ కిట్లు ధరించిన డ్రైవర్లతో పాటు ఈ ఆటో అంబులెన్స్లు కరోనా రోగుల కోసం మేము సైతం అంటూ రంగంలోకి దిగాయి . మే 6 నుండి ఇలాంటి 20 ఆటో సర్వీసులు ప్రారంభించబడతాయి. ఇది సంక్షోభ సమయం , అందరూ కలిసి పనిచేయాలని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆటో అంబులెన్స్లను 9818430043 మరియు 011-41236614 అనే రెండు నంబర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీలో ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 18,063 కు చేరుకోగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,53,902 గా ఉంది. ఢిల్లీలో 11.43 లక్షలకు పైగా రికవరీలు ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీకి ఆక్సిజన్ ఇస్తే ఎవరూ చనిపోకుండా చూస్తామని కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి
రాజధానిలో వేలాది మంది మరణించిన కరోనావైరస్ సంక్షోభం మధ్య కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిరోజూ 700 టన్నుల సరఫరా కేటాయించినట్లయితే ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోకుండా చూస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు. మాకు 700 టన్నులు ఆక్సిజన్ లభిస్తే , మేము ఢిల్లీలో 9,000-9,500 పడకలను ఏర్పాటు చేయగలుగుతామని పేర్కొన్నారు. కేంద్రాన్ని సాయం కోసం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు కేజ్రీవాల్.