లవ్ మ్యారేజ్ చెయ్యడానికి వెళ్లారు, ప్రమాదంలో నలుగురు యువకులు దర్మరణం!
బెంగళూరు: స్నేహితుడికి ప్రేమ వివాహం చెయ్యడానికి వెళ్లిన నలుగురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ప్రేమికులకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిత్రదుర్గ సమీపంలోని మదకరిపుర, నంజయ్యన కొట్టిగెలకు చెందిన చరణ్ (22), మనోహర్ (21), శరణ్ (23), చిదానంద (23) అనే యువకులు దుర్మరణం చెందారని చిత్రదుర్గ జిల్లా ఎస్పీ శ్రీనాథ్ జోషి చెప్పారు. చరణ్ స్నేహితుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు.
పెద్దలకు భయపడిన అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి దగ్గరకు వచ్చేసింది. ప్రేమికులు మాకు పెళ్లి చెయ్యాలని చరణ్ దగ్గరకు వెళ్లారు. తరువాత చరణ్, మనోహర్, శరణ్, చిదానంద, కర్ణాటక రక్షణా వేదిక నాయకులు ప్రేమికులను వెంట తీసుకుని వెళ్లి జిల్లా ఎస్పీ శ్రీనాథ్ జోషిని కలిసి రక్షణ కల్పించాలని మనవి చేశారు.
వేకువ జామున ప్రేమికులకు ఓ దేవాలయంలో పెళ్లి చెయ్యడానికి అందరూ ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో చిత్రదుర్గ జిల్లా హిరయూరు తాలుకాలోని హర్తికోటే సమీపంలో వేగంగా వెలుతున్న లారీ ఆటోను ఢీకొనింది. ఈ ప్రమాదంలో చరణ్, మనోహర్, శరణ్, చిదానంద దుర్మరణం చెందారు. ప్రేమ పెళ్లి చెయ్యడానికి వెళ్లిన యువకులు దుర్మరణం చెందడంతో నాలుగు కుటుంభాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.