చివరికి ఇన్ఫోసిస్ కూడా ఇలాగా?: ఉద్యోగుల కోసం ప్రత్యర్థి కంపెనీలకు వల!
ఓ వైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్, మరోవైపు అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ప్రభావంతో దేశీయ రెండో అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ప్రత్యర్థి కంపెనీలలో కీలకమైన పదవుల్లో ఉన్న ఉద్యోగులకు వల విసురుతోంది.
బెంగళూరు: ఓ వైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభావంతో దేశీయ రెండో అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ప్రత్యర్థి కంపెనీలలో కీలకమైన పదవుల్లో ఉన్న ఉద్యోగులకు వల విసురుతోంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల్లో ఇన్ఫోసిస్ అక్రమాలకు పాల్పడుతూ, ప్రత్యర్థి కంపెనీలకు ఝలక్ ఇస్తున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మార్చితో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ అక్రమంగా ఇతర సంస్థల ఉద్యోగులను లాగేసుకున్నట్లు ఆ నివేదికలు చెబుతున్నాయి.
చూపు... ప్రత్యర్థి కంపెనీల వైపు
కాగ్నిజెంట్ నుంచి 13 మంది ఎగ్జిక్యూటివ్ లను, క్యాప్ జెమినీ నుంచి 13 మందిని, టీసీఎస్ నుంచి ఐదుగురిని.. విప్రో, ఐబీఎం, యాక్సెంచర్ నుంచి 8 మందిని ఇన్ఫోసిస్ తన కంపెనీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇంకా కొంతమంది ఇతర ఉద్యోగులను హెచ్సీఎల్ టెక్నాలజీస్, జెన్సార్, టెక్ మహీంద్రా, ఐటీసీ ఇన్ఫోటెల్ నుంచి నియమించుకున్నట్లు సమాచారం. అయితే ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎగ్జిక్యూటివ్ ల తీసుకోవడంపై స్పందించడానికి మాత్రం ఇన్ఫోసిస్ నిరాకరించింది.
ట్రంప్ ప్రభావమే...
టెక్ దిగ్గజాలు ఒక కంపెనీ ఉద్యోగులను మరో కంపెనీలోకి తీసుకోవడం సాధారణమే అయినా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ రకమైన చర్యలకు పాల్పడక తప్పడం లేదు. ఈ వీసాలపై ప్రతిభావంతులైన ఉద్యోగులనే తమ దేశ కార్యాలయాల్లోకి తీసుకోవాలంటూ ట్రంప్ హెచ్చరికలు చేయడంతో ఇన్ఫోసిస్ ఉద్యోగుల నియామకంలో నైతిక విలువలను కాస్త పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఒక్క అమెరికాలోనే 10 వేల మంది...
గతేడాది ఇన్ఫోసిస్ అమెరికాలో 150 మంది టాప్-పెయిడ్ ఎగ్జిక్యూటివ్ లను నియమించుకుంది. అయితే, వారిలో సగానికి పైగా వ్యక్తులు దాని ప్రత్యర్థి కంపెనీ వారేనని ఈటీ డేటాలో వెల్లడైంది. వచ్చే రెండేళ్లలో ఇన్ఫోసిస్ అమెరికాలో 10 వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు సమాచారం. ఇన్ఫోసిస్ తో పాటు మిగతా టెక్ కంపెనీలు కూడా స్థానిక ఉద్యోగులను భారీగా నియమించుకోనున్నట్టు ప్రకటించాయి.
ఇది ఇవాళేం కొత్త కాదు...
ప్రతిభావంతులైన ఉద్యోగులను దక్కించుకోవడంలో టెక్ కంపెనీలు అనేక ఎత్తుగడలకు పాల్పడుతుంటాయని, ఇది ఇవాళేం కొత్త కాదని, ఈ పోటీ నిరంతరం సాగుతూనే ఉంటుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. అయితే తాము ప్రత్యర్థి కంపెనీల వైపు కాకుండా, క్యాంపస్ నియామకాల వైపు ఎక్కువగా మొగ్గుచూపినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆన్ షోర్ లో గతంలో కంటే ఎక్కువగా టాలెంట్ ఉన్న ఉద్యోగులు కావాలన్నారు. ప్రతి కంపెనీ ప్రస్తుతం నియామకాలు చేపడుతుందని, ఒకవేళ ఆన్ షోర్ లో మంచి పనితీరు కనబరిస్తే ఇదే వారికి మంచి సమయని ఓ ఇండియన్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.