కుదేలైన ఆటోమొబైల్ ఇండస్ట్రీ: మారుతీ సుజుకీ, హీరో కార్ప్ బైకుల సేల్స్ ఢమాల్..!
న్యూఢిల్లీ: భారత్లో గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వాహనాల అమ్మకాలు ఒక్క ఆగష్టులోనే పడిపోయాయి. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చర్ (సియామ్) నివేదిక పేర్కొంది. 1997-98లో తమ ప్రస్థానం ప్రారంభమైన నాటినుంచి ఆటోమొబైల్ సేల్స్ పై తాము సమాచారం సేకరిస్తున్నామని చెప్పిన సియామ్ ఇంత దారుణంగా అమ్మకాలు పడిపోవడం ఇదేతొలిసారి అని వెల్లడించింది.
ఏపీకి వరద హెచ్చరిక, రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సియామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్రవాహనాలు, ఇతర కమర్షియల్ వాహనాల మొత్తం సేల్స్ ఈ ఏడాది ఆగష్టుకు 18,21,490 యూనిట్లుగా ఉండగా గతేడాది అంటే 2018 ఆగష్టుకు ఈ సంఖ్య 23,82,436 యూనిట్లుగా ఉందని పేర్కొంది. అంటే 23.55శాతం సేల్స్ పడిపోయినట్లు ధృవీకరించింది. ఇక జూలై నెలలో గత 19 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సేల్స్ పడిపోయినట్లు వెల్లడించింది సియామ్ సంస్థ.
ఇక స్థానికంగా తయారయ్యే ప్యాసింజర్ వాహనాలు సంగతైతే చెప్పక్కర్లేదు. ఆగష్టులో అమ్మకాలు ఏకంగా 31.57శాతం మేరా పడిపోయాయి. గతేడాది ఆగష్టులో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,87,198 యూనిట్లు ఉండగా ఈసారి అది 1,96,524 యూనిట్లకు చేరుకుంది. ఇక ఈ ఏడాది జూలైలో హోల్సేల్ అమ్మకాలు 30.98శాతం మేరా తగ్గాయి. ఇక ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది పదవ నెల కావడం విశేషం.
ఆగష్టు నెలలో మారుతీ సుజుకీ వాహనాల అమ్మకాలు 36.14శాతం తగ్గిపోగా.. హ్యూందాయ్ మోటార్స్ లిమిటెడ్ వాహనాల సేల్స్ 16.58శాతం తగ్గిపోయాయి.మహీంద్ర అండ్ మహీంద్ర వాహనాలు 31.58శాతం తగ్గిపోయాయని సియామ్ వెల్లడించింది. ఇక ద్విచక్రవాహనాల అమ్మకాల్లో కూడా విపరీతమైన తగ్గుదల కనిపించింది. ఈ ఏడాది 22.33శాతం మేరా సేల్స్ తగ్గిపోయినట్లు సియామ్ నివేదిక వెల్లడించింది. హీరో మోటో కార్ప్ సేల్స్ 20.37శాతం తగ్గాయని సియావ్ నివేదిక స్పష్టం చేసింది.
ఇక ఇప్పటికే ఆటోమొబైల్ సేల్స్ విపరీతంగా పడిపోవడంతో వాహనాల విడి భాగాలపై ప్రస్తుతం ఉన్న 28శాతం జీఎస్టీని 18శాతంకు కుదించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో సేల్స్ పడిపోవడంతో ఉద్యోగాల కల్పన కూడా కష్టమైందని నివేదిక వెల్లడించింది.