కరోనా రోగి మృతదేహానికి పోస్ట్ మార్టం.. 18గంటల పాటు జీవించే ఉన్న వైరస్ , లెదర్ బంతిలా ఊపిరితిత్తులు
కరోనా వైరస్ పై షాకింగ్ విషయాలు పలు అధ్యయనాల్లో వెలుగులోకి వస్తున్నాయి . తాజాగా కరోనావైరస్ తో మరణించిన 62 ఏళ్ల రోగి యొక్క ఊపిరితిత్తులు చాలా గట్టిగా ఒక లెదర్ బాల్ లాగా మారాయని కర్ణాటకలో ఒక రోగికి నిర్వహించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది . మరణం తరువాత కూడా శరీరంలో కరోనావైరస్ 18గంటలపాటు రోగి శరీరంపై బతికే ఉంటుందని తాజాగా ఒక నివేదికలో తేలింది . కరోనావైరస్ రోగి పోస్ట్ మార్టం లో మరణించిన 18 గంటల తర్వాత కూడా ముక్కు మరియు గొంతు భాగాలలో నమూనాలలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు వైద్య నిపుణులు .
మృత శరీరంలో ఊపిరితిత్తులు లెదర్ బాల్ లా ఉన్నాయన్న ఫోరెన్సిక్ నిపుణుడు
కరోనా రోగి మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన ఆక్స్ ఫర్డ్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దినేష్ రావు మాట్లాడుతూ, రోగి యొక్క ఊపిరితిత్తులు తోలు బంతిలాగా గట్టిగా ఉన్నాయని , శ్వాసనాళాలు చీలిపోయి రక్త నాళాలలో గడ్డకట్టడంతో రోగి మృతి చెందినట్టు గుర్తించారు . కోవిడ్ మృతుల పోస్ట్ మార్టం వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగ అధిపతి అయిన దినేష్ రావు చెప్పారు. అక్టోబర్ 10 న ఒక గంట 10 నిమిషాల్లో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేశామని ఆయన చెప్పారు .
కరోనా మృత శరీరంలోనూ కరోనా వైరస్
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. కరోనా మృతుల ముక్కు, గొంతు మరియు నోరు, ఊపిరితిత్తుల ఉపరితలం, శ్వాసకోశం , శ్వాసనాళాలు మరియు ముఖం మరియు మెడపై చర్మం నుండి ఐదు నమూనాలను తీసుకుని పరిశీలించగా . కరోనావైరస్ ముక్కు మరియు గొంతు నమూనాలు పాజిటివ్ ను సూచించాయని , ఆర్టీపీసీఆర్ పరీక్షలలో పాజిటివ్ గా తేలిందని చెప్పారు .దీని అర్థం కోవిడ్ రోగి యొక్క మృతదేహం కూడా కరోనాను వ్యాప్తి చెయ్యగలదని అన్నారు.
కరోనాతో మృతి తర్వాత శరీర పరిస్థితి అధ్యయనం .. నిర్వహించిన పోస్ట్ మార్టం
కుటుంబ సమ్మతితో పోస్ట్ మార్టం చేసినట్టు చెప్పిన ఫోరెన్సిక్ నిపుణులు రోగి మరణించినప్పుడు, అతని కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని ఇవ్వకుండా అధికారులే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అంతిమ క్రియలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . కరోనాతో మృతి చెందిన వారి దేహాలను పోస్ట్ మార్టం కూడా చెయ్యటం లేదు. అయితే యుఎస్ మరియు ఇటలీ లలో కరోనా మృతుల శవ పరీక్షలు నిర్వహించారు. కరోనాతో మరణం తర్వాత శరీరంలో మార్పులు ఎలా ఉన్నాయన్న దానిపై వారు అధ్యయనం చేశారు . అయితే ఆ నివేదికలలో కనిపించిన ఫలితాలకు ఇక్కడ చేసిన ఫలితాలకు వ్యత్యాసం ఉందని చెప్తున్నారు . దీని అర్థం భారతదేశంలో కనిపించే కరోనా వైరస్ జాతులు ఇతర దేశాల వైరస్ కు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు .