ఆ ముగ్గురు విద్యార్థినులది హత్యేనా?: కోర్టుకు రిపోర్ట్
చెన్నై: తమిళనాడులోని చెన్నై శివారు విల్లుపురం ఎస్వీఎస్ కళాశాల విద్యార్థినుల మృతి కేసు మలుపు తిరిగింది. వీరిది హత్యే అన్న వాదనలకు బలం చేకూరే రీతిలో కోర్టుకు పోస్టుమార్టం నివేదిక చేరింది. ఊపిరి ఆడక పోవడం వల్లే మరణించినట్టుగా సిబి సిఐడి నివేదికలో పేర్కొనడం కేసును మలుపు తిప్పింది. అలాగే, బావిలో దూకి మరణించి వుంటే, ఊపిరితిత్తుల్లోకి నీళ్లు చేరి ఉండేదని, అలా జరగలేదని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యార్థినులది హత్యే అనడానికి బలం చేకూరినట్లయిది.
విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలోని ఎస్వీఎస్ సిద్ధ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థినులు శరణ్య (19), ప్రియాంక (19), మోనీషా (19)లు అనుమానాస్పద స్థితిలో బావిలో జనవరి 23న శవాలుగా తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది. ఈ కేసులో తొలుత ఆ జిల్లా యంత్రాంగం ఎవర్నో రక్షించే ప్రయత్నం చేసినట్టుగా మెతక వైఖరి అనుసరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. సీబీ సీఐడీకి విచారణ అప్పగించింది. ఈ కేసులో ఆ కళాశాల కరస్పాండెంట్ వాసుకీతో పాటుగా నలుగురు అరెస్టయ్యారు. ఈ అరెస్టులతో ఆ కళాశాలకు గుర్తింపు లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, ఆ విద్యార్థినుల మృతి మిస్టరీగానే ఉండటంతో దర్యాప్తు వేగం పెరగలేదని చెప్పవచ్చు. కాగా, తన కుమార్తె మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ మోనీషా తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఆమె మృత దేహానికి మరో మారు పోస్టుమార్టం చెన్నైలో జరిగింది.
ఇది ఇలా ఉండగా, మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న మోనీషా తండ్రి తమిళరసన్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కోర్టుకు విల్లుపురం వైద్య వర్గాలు జరిపిన పోస్టుమార్టం నివేదిక చేరడం, అందులో పేర్కొన్న అంశాలు కేసును మలుపు తిప్పినట్టు చేసింది. అందులో మృతి చెందిన వారి ఊపిరి తిత్తుల్లో నీళ్లు లేవు అని పేర్కొని ఉండటంతో ఇది ముమ్మాటికీ హత్యే అన్న వాదనలకు బలం చేకూరినట్టు అవుతోంది.
అయితే, ఊపిరితిత్తుల్లోనే నీళ్లు చేరని దృష్ట్యా, ఇది హత్యే అన్న వాదనను తమిళరసన్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే చెన్నైలో జరిగిన పోస్టుమార్టం మేరకు మోనీషా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించిందని, ఊపిరి ఆడకుండా చేసి మరణించిన అనంతరం నీళ్లలోకి తెచ్చి పడేసినట్టుందని తమిళరసన్ తరపు వైద్యుడు సంపత్ స్పష్టం చేశారు.
కాగా, తన కుమార్తె శరణ్య మృత దేహానికి సైతం రీ పోస్టుమార్టం జరపాలని కాంచీపురం జిల్లా సెయ్యారుకు చెందిన ఏలుమలై కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై మంగళవారం కోర్టు విచారణ నిర్వహించి, ఉత్తర్వుల్ని జారీ చేయనుంది.