ముంచెత్తిన మంచు.. ఐదుగురు సైనికులు సహా 9 మంది మృతి
కశ్మీర్ లోని బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్ లో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు సైనికుల సహా 9 మంది మృతి చెందారు.
జమ్మూ కశ్మీర్: మంచుచరియలు విరిగిపడి ఐదుగురు సైనికుల సహా 9 మంది మృతి చెందిన ఉదంతమిది. బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించిన సమాచారం అందగానే విపత్తు రక్షక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
మరణించిన వారిలో ఐదుగురు సైనికులతోపాటుగా నలుగురు వ్యక్తులు ఉన్నారు. సైనికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన నలుగురు సైనికుల మృతదేహాల కోసం గాలింపు జరుపుతున్నారు.
మరోవైపు మంచులో కూరుకుపోయి నలుగురు వ్యక్తులు కూడా మృతి చెందారు. ఈ నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. భారీగా మంచు కురుస్తున్న ప్రాంతాలకు వెళ్ళొద్దని స్థానికులను అక్కడి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన మృతుల వివరాలు... హబీబుల్లా(50), అజిజీ(48), గుల్షాన్ బానో(19), ఇర్ఫాన్(17)గా పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం అంతటా సోమవారం నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. రాత్రిళ్ళు అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది.
తాజాగా కురుస్తున్న మంచు కారణంగా రోడ్లన్నీ జారుడుగా మారడంతో శ్రీనగర్-జమ్మూ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మంగళవారం నాడు శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అధికారులు విమానాల రాకపోకలను కూడా అనుమతించలేదు.