మంచుగడ్డలు కూలిపడటంతో నలుగురు జవాన్లు ఇద్దరు పౌరులు మృతి
సియాచిన్ గ్లేసియర్ వద్ద మంచు కొండలు విరిగి పడటంతో దానికింద చిక్కుకుని నలుగురు జవాన్లు మృతి చెందారు.ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఎనిమిది మంది జవాన్లు ఈ మంచు కొండల కింద చిక్కుకుపోయిన్ట్లు తెలుస్తోంది. లడఖ్ ప్రాంతంలోని సియాచిన్లో విపరీతమైన మంచు కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఉత్తర గ్లేసియర్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై మంచుకొండలు విరిగి పడ్డాయి. వెంటనే ఆర్మీ సిబ్బంది చిక్కుకున్న జవాన్లను కాపాడే ప్రయత్నం చేశాయి.
మంచుకొండల శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది జవాన్లను బయటకు తీసింది ఆర్మీ సిబ్బంది. ఇందులో ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం హెలికాఫ్టర్ ద్వారా దగ్గరలోని మిలటరీ హాస్పిటల్కు తరలించారు. వారిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇందులో నలుగురు జవాన్లు మృతి చెందగా ఇద్దరు పౌరులు కూడా చనిపోయినట్లు ఆర్మీ తెలిపింది. సైనికులు చిక్కుకున్న ప్రాంతం19వేల అడుగులకు పైన ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలా మంచుగడ్డలు కూలిపడి సైనికులు చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. 1984లో భారత్తోపాటు పాకిస్థాన్లో కూడా మంచుగడ్డలు కూలి సైనికులను కోల్పోయిందన్న విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. 2016 ఫిబ్రవరిలో మంచుగడ్డ పడిపోయి దాదాపు 10 మంది జవాన్లు చనిపోయిన ఘటన మరవక ముందే మళ్లీ ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలోనే లాన్స్ నాయక్ హనుమంతప్ప కోప్పాడ్ 25 ఫీట్ల మంచులో ఇరుక్కున సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో దాదాపు ఆరురోజులు పాటు హనుమంతప్ప మృత్యువుతో పోరాడి చివరికి ఆసువులు బాసారు. హనమంతప్పతోపాటు 10 మంది సైనికులు ఫిబ్రవరి 3వ తేదీన సోనమ్ పోస్ట్ వద్ద గస్తీ కాస్తుండగా మంచు పెళ్ల వారిపై పడింది. అది కూడా దాదాపు 20 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికక్కడే 9 మంది చనిపోగా.. హనుమంతప్ప మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.