ఏవియేషన్ డేటా: దాడులకు ముందే పాక్ ఆక్రమిత భారత్లో ముందస్తు హెచ్చరికల విమానం
పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ బాలాకోట్ విజయవంతం అయ్యింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ మెరుపు దాడి పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు తెలుస్తోంది. దాడులకు ముందే పాకిస్తాన్లో మిలటరీ కదలికలను, ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడున్నాయో అంచనా వేసేందుకు ముందుగా ఈఎంబీ 145 విమానం సరిహద్దుల్లో చక్కర్లు కొట్టింది .దీంతో పాటు మరో విమానం ఐఎల్ 78 కూడా చక్కర్లు కొట్టినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో గుర్తించడం జరిగింది.
ఈఎంబీ 145 విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన విమానం. భారత వాయుసేన శత్రుదేశాలపై దాడి చేయడానికి ముందు ఈ విమానంను పంపించి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తారు. ఈ విమానం ఇచ్చిన సమాచారంతోనే రంగంలోకి అసలైన యుద్ధ విమానాలు దిగి దాడులు నిర్వహిస్తాయి. యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి వెళ్లి దాడి చేయక ముందే భారత గగన తలం, సరిహద్దు వెంట ఓ విమానం చక్కర్లు కొట్టినట్లు ఏవియేషన్ డేటా చూపిస్తోంది.
Indian Air Force Embraer EMB-145AEW Airborne early warning and control aircraft. pic.twitter.com/NOfi0cU7Zy
— redandblackattack (@redanblacattack) February 26, 2019
ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాద సంస్థ సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకార చర్యకు భారత్ దిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో పాక్ గగనతలంలోకి దూసుకెళ్లిన భారత వాయుసేన మెరుపుదాడులు నిర్వహించి భారత్కు తిరిగి క్షేమంగా చేరుకుంది. ఈ దాడుల్లో కనీసం 300 మందిని మట్టుబెట్టి ఉంటారని వాయుసేన చెబుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషేమహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరేతోయిబాలా శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది.
మంగళవారం ఉదయం 3:30 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసి మొత్తం 21 నిమిషాల్లో పూర్తి చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ దాడులకు మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత వాయుసేన వినియోగించింది. మొత్తం 12 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులతో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది భారత వాయుసేన. ముందుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఆపై పాక్ గగనతలంలోకి వెళ్లి దాడులు నిర్వహించింది.