రెంట్ కట్టకుండా పరేషాన్.. ఓనర్కు చుక్కలు.. తుపాకీతో కాల్చుకుని..!
ఢిల్లీ : రెంట్ చెల్లించలేదు. పైగా ఇంటి యజమానికి చుక్కలు చూపించాడు. నెలలకొద్దీ కిరాయి కట్టకుండా కల్లిబొల్లి మాటలు చెప్పాడు. చివరకు ఓనర్ గద్దించడంతో రివర్స్ గేర్ వేశాడు. యజమానిని పోలీసు కేసులో ఇరిక్కిద్దామని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, యాక్షన్ ప్లే చేసి చివరకు తానే కటకటాల పాలయ్యాడు. ఓనర్ను అలా బెదిరిద్దామని భావించి ఇలా పోలీసులకు చిక్కాడు. సీన్ రివర్స్ కావడంతో చేసేదేమీ లేక జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది.
పేయింగ్ గెస్ట్ హౌజ్ యజమానికి చుక్కలు
తిన్నాడు, ఉన్నాడు.. చివరకు పేయింగ్ గెస్ట్ హౌజ్ యజమానికి చుక్కలు చూపెట్టాడు. వందలు కాదు వేలు కాదు ఏకంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఎగ్గొట్టడానికి ప్లాన్ వేశాడు. చివరకు అది కాస్తా బెడిసికొట్టడంతో దిక్కు తోచని పరిస్థితిలో పడ్డాడు. చెల్లించాల్సిన మొత్తం పెద్దదిగా ఉండటంతో పెద్ద స్కెచ్ వేసి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.
ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల సునీత్.. అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పేయింగ్ గెస్ట్ హౌజ్లో కొద్ది నెలలుగా ఆశ్రయం పొందుతున్నాడు. అయితే నెల నెలా చెల్లించాల్సిన ఎమౌంట్ను మాత్రం ఓనర్కు చెల్లించకుండా కల్లిబొల్లి మాటలు చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు. అయితే బిల్లు కాస్తా రెండు లక్షలకు పైగా చేరడంతో యజమాని లబోదిబమంటున్నాడు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు షాక్.. ఎస్పీజీ భద్రత రద్దు.. Z+ ప్రొటెక్షన్..!
2 లక్షలకు పైగా బకాయిలు
చాలా కాలంగా పేయింగ్ గెస్ట్ ఛార్జెస్ చెల్లించకపోవడం.. అది కాస్తా రెండు లక్షల ఇరవై ఐదు వేలకు చేరడం.. యజమానికి చిర్రు తెప్పించింది. తనకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వాలని వత్తిడి పెంచుతూ వచ్చాడు యజమాని వరుణ్. ఆ క్రమంలో చావు తెలివి తేటలు ప్రదర్శించాడు సునీత్. దాంతో బకాయిల విషయమై ఈ నెల 23వ తేదీన ఉదయం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి వరకు తనకు డబ్బు చెల్లించాలని హెచ్చరించాడు.
అయితే అప్పటికప్పుడు అంత మొత్తం చెల్లించే పరిస్థితి సునీత్కు లేదు. దాంతో కొత్త డ్రామాకు తెర తీశాడు. తనకు తానుగా గన్తో కాల్చుకుని హాస్పిటల్లో చికిత్స కోసం చేరాడు. ఆ క్రమంలో పోలీసులకు సదరు పేయింగ్ గెస్ట్ హౌజ్ ఓనర్పై ఫిర్యాదు చేశాడు. బకాయిలు చెల్లించాలంటూ వత్తిడి చేయడమే గాకుండా తుపాకీతో కాల్చినట్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు.
డ్రామా ఆడి.. చివరకు అడ్డంగా దొరికి
మొదట్లో సునీత్ చెప్పిందని నిజమేనంటూ నమ్మిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. సునీత్ కథ అల్లిన తీరు.. అతడి గదిలో రక్తపు మరకల ఆధారంగా పోలీసులు గుడ్డిగా నమ్మేశారు. దాంతో పేయింగ్ గెస్ట్ హౌజ్ ఓనర్ వరుణ్పై కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో వరుణ్ను అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేశారు. అయితే సునీత్ను తాను కాల్చలేదని.. తనకు ఏమీ తెలియదని వరుణ్ చెబుతూ వచ్చాడు. అయితే వరుణ్ పోలీసులకు సహకరిస్తున్న తీరు చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ కేసులో ఇంకేదో కోణం ఉందని అనుమానించడం మొదలుపెట్టారు.
భార్యల మీద కోపంతో.. భర్తల క్షణికావేశం.. చంపుతున్నారు, లేదంటే..!
హాస్పిటల్ నుంచి పరార్.. చివరకు సోదరి ఇంట్లో దొరికిపోయాడుగా..!
ఆ క్రమంలో పోలీసుల అనుమానం నిజమే అయింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సునీత్ ను మరోసారి పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది. తొలుత పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులను బుకాయించాలని చూశాడు. అయినా కూడా వాళ్లు పదేపదే ప్రశ్నించడంతో చివరకు హాస్పిటల్ నుంచి పరారయ్యాడు సునీత్. దాంతో అతడే నాటకం ఆడాడని గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సోదరి ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మేరకు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పేయింగ్ గెస్ట్ హౌజ్ ఓనర్కు బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడానికి ఇదంతా డ్రామా ఆడాల్సి వచ్చిందని పోలీస్ దర్యాప్తులో అంగీకరించాడు.