రైల్వే ట్రాక్ దాటాలని ప్రయత్నించారో.. యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు
ఈ మధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరగడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు పట్టాలు దాటుతుండగా రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రైలు ఇంకా చాలా దూరంలో ఉందని భావించి తొందరపడి పట్టాలు దాటామా అంతే సంగతులు రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలా రైలు పట్టాలు దాటుతూ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకోసమే వెస్ట్రన్ రైల్వే సంస్థ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
వెస్ట్రన్ రైల్వే అవగాహన కార్యక్రమం
రైల్వే ట్రాక్లపై నడవడం కానీ, పట్టాలు దాటడం కానీ అత్యంత ప్రమాదకరం అని చెబుతూ ప్రయాణికుల్లో లేదా ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది రైల్వే శాఖ. రైలు పట్టాలు దాటుతున్న వారిముందు యమధర్మ రాజు ప్రత్యక్ష్యం అవుతున్నాడు. పట్టాలపై నడుస్తున్న వారిని అమాంతం తన భుజాలపై వేసుకుని తీసుకెళుతున్నాడు. ఇలా యమధర్మరాజు పట్టాలపై దాటుతున్న వారిని మోసుకెళుతున్న ఫోటోలను వెస్ట్రన్ రైల్వే శాఖ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. నల్లటి వస్త్రధారణతో ఉన్న యమధర్మరాజు పట్టాలు దాటుతున్న వారిని తన భుజంపై మోసుకెళ్లి ప్లాట్ఫాంపై వదులుతున్నాడు. ఈ ఫోటోలను పోస్టు చేయగానే నెటిజెన్ల నుంచి వెస్ట్రన్ రైల్వేకు ప్రశంసల అందాయి.
ట్రాక్ పక్కన కానీ పట్టాలు దాటడం కానీ చేయకూడదు
ప్రజల ప్రాణాలే ముఖ్యం అని ఇతివృత్తంతో ఈ అవగాహన కార్యక్రమంను ప్రారంభించింది వెస్ట్రన్ రైల్వే. పట్టాల పక్కన నడవడం కానీ, పట్టాలు దాటడం కానీ చాలా ప్రమాదకరం అని చెబుతోంది. ప్రయాణికులు ప్లాట్ఫాంపై కానీ లేదా ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి కానీ నడవాలని సూచిస్తోంది. కొన్ని చోట్ల సబ్వేలు కూడా ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని వెస్ట్రన్ రైల్వే సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇక ఫేస్బుక్లో మరిన్ని ఫోటోలు పోస్టు చేయడంతో 22 గంటల్లోనే 800 షేర్లు వచ్చాయి.
వెస్ట్రన్ రైల్వేపై నెటిజెన్ల ప్రశంసలు
ఇక వెస్ట్రన్ రైల్వే తీసుకున్న ఈ బాధ్యతను చాలామంది నెటిజెన్లు ప్రశంసించారు. రైల్వే అధికారులకు ప్రయాణికుల ప్రాణాలపట్ల ఉన్న శ్రద్ధకు సెల్యూట్ చేస్తున్నామని కొందరు పోస్టులు పెట్టారు. ఇదొక గొప్ప అవగాహన కార్యక్రమం అని కొనియాడారు. మరికొందరు మాత్రం శిక్షణ తీసుకున్న యమధర్మరాజు మాత్రమే ఇలాంటి పనిచేయాలని చెప్పారు. ఎందుకంటే యమధర్మరాజు ప్రజలను ట్రాక్పై నుంచి మోసుకెళుతున్న సమయంలో అటుగా వస్తున్న రైలు డ్రైవర్కు కనిపించకుంటే అది మరో ప్రమాదంకు దారితీస్తుందని ట్వీట్ చేశారు.
గతంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
అంతకుముందు ట్రాఫిక్ నిబంధనలపై కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమమే నోయిడా, బెంగళూరు నగరాల్లో నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ఏం జరుగుతుందో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ యమధర్మరాజు గెటప్లో చేసి చూపించాడు. హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించాలని మద్యం సేవించి స్టీరింగ్ చేతపట్టరాదని చెబుతూ అవగాహన కార్యక్రమాలను బెంగళూరులో నిర్వహించారు.