అయోధ్య భూమి పూజ: క్రతువు ఆరంభం - ఇక్బాల్ అన్సారీకి తొలి ఇన్విటేషన్ - ఉమా భారతి అనూహ్యం
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. 11 మంది పూజారులు సోమవారం గౌరీ గణేశ పూజతో క్రతువు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే భూమి పూజలో బుధవారం(5న) ప్రధాన ఘట్టంగా శంకుస్థాపన వేడుక జరుగనుంది. భూమి పూజ సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. శ్రీరాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలోనే బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన జరుగనుంది.
Recommended Video
అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే - ముందుగా 'హనుమాన్ గధీ'కి మోదీ.. కరోనా కట్టడికీ పూజలు..
మొదటి కార్డు ముస్లింకు..
మందిరం-మసీదు వివాదంపై గతంలో దేశంలోని మిగతా ప్రాంతాల్లో అల్లర్లు జరిగినా, అయోధ్యలో మాత్రం రెండు వర్గాలూ ఇప్పటికీ సోదరభావంతోనే మెలుగుతుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే.. సోమవారం మరో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భూమి పూజ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రూపొందించిన ప్రత్యేక ఇన్విటేషన్ కార్డును తొలిగా ఇక్బాల్ అన్సారీకి అందజేశారు. బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన కక్షిదారుల్లో ఇక్బాల్ అన్సారీ ప్రముఖుడు.
శ్రీరాముడి ఆకాంక్ష..
భూమిపూజ కోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను'' అని ఆయన వ్యాఖ్యానించారు. మందిర నిర్మాణంతో అయోధ్య పూర్తిగా మారిపోతుందని, నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని, రాముడి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్సారీ అన్నారు.
పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనం
మోదీతోపాటు మరో ముగ్గురి పేర్లు..
సుమారు రూ.500 కోట్ల వ్యయంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మితం కానున్న భవ్య రామ మందిరానికి బుధవారం శంకుస్థాపన జరుగనుంది. ఇందుకోసం రూపొందించిన ఆహ్వాన పత్రికల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మరో ముగ్గురికి మాత్రమే చోటు కల్పించారు. పసుపు, కాషాయ రంగులు మేళవింపుతో రూపొందిన ఆహ్వాన పత్రికపై మోదీతోపాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ రావ్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 150 మంది అతిథులకు ఈ కార్డును పంపినట్లు పేర్కొన్నారు.
అయోధ్యలోనే.. కానీ పూజకు వెళ్లను..
అయోధ్య మందిరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి అనూహ్య ప్రకటన చేశారు. బుధవారం తాను అయోధ్యకు వెళతానని, అయితే భూమి పూజ కార్యక్రమానికి మాత్రం దూరంగా ఉంటానని చెప్పారు. పూజ సమయంలో తాను సరయూ తీరంలో ఉంటానని, అందరూ వెళ్లిపోయిన తర్వాత జన్మభూమికి వెళతానని తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి గల కారణాలను కూడా ఆమె వెల్లడించారు.
ప్రధానిపై ఉమా భారతి ఆందోళన..
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు బీజేపీకి చెందిన మరికొందరు అగ్ర నేతలకు కరోనా సోకడం, పలువురు కేంద్ర మంత్రులు సైతం ఐసోలేషన్ కు పరిమితమైన నేపథ్యంలో.. భూమి పూజకు వచ్చే వారి విషయంలో తాను కలవరానికి గురవుతున్నానని, మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ విషయంలో ఆందోళన చెందుతున్నానని ఉమా భారతి తెలిపారు. కరోనా నేపథ్యంలోనే తాను భూమి పూజలో నేరుగా పాల్గొనబోవడంలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, ఇష్టంలేకున్నా అయోధ్య ఆచారాలను దాటవేయాల్సి వస్తున్నదని ఆమె వ్యాఖ్యానించారు.