అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే - ముందుగా ‘హనుమాన్ గధీ’కి మోదీ.. కరోనా కట్టడికీ పూజలు..
అయోధ్య మందిర ఉద్యమం పేరు వింటేనే ఠక్కున గుర్తొచ్చే నాయకుడు ఎల్కే అద్వానీ. అలాంటాయన.. ఆగస్టు 5న జరగబోయే రామ మందిరం భూమి పూజలో పాల్గొంటారా, లేదా అనే గందరగోళం వీడింది. అయోధ్య నగరంలో ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ లోనూ ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి.
ఆగస్టు 6 వరకే జగన్ తాత్కాలిక ఆనందం - ఉసురు తప్పదన్న టీడీపీ - పాఠ్యాంశంగా తరలింపంటూ..
వీడియో లింక్ ద్వారానే..
ఆగస్టు 5న జరుగనున్న భవ్య రామ మందిర నిర్మాణం భూమి పూజ కోసం అద్వానీ, మురళి మనోహర్ జోషిలు నేరుగా అయోధ్య వెళ్లబోవడం లేదని, ఆ ఇద్దరు నేతలూ వీడియో లింక్ ద్వారానే పూజలో పాల్గొంటారని విశ్వసనీయంగా తెలిసింది. మందిర నిర్మాణానికి నేతృత్వం వహిస్తోన్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఆద్వానీ, జోషిలకు పంపకపోవడం వివాదాస్పదమైంది. తొలుత, కరోనా కారణంగా వయసు రీత్యా మొదట వీరికి ఆహ్వానం పంపలేదన్న ట్రస్టు.. శనివారం నాడే సదరు నేతలకు ఆహ్వానాలు పంపి, ఫోన్లు కూడా చేశామని చెప్పింది. ఆదివారం నాటికి నేతల హాజరుపై ఎట్టకేలకు క్లారిటీ రావడంతో వివాదం సర్దుమణిగింది. భూమి పూజ వేడుకలో.. ప్రధాని మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ మాత్రమే ప్రధాన వేదికపై కూర్చుంటారని తెలుస్తోంది.
హనుమాన్ గధీకి మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 5న అయోధ్యలో భవ్య రామ మందిరం భూమిపూజలో పాల్గొనడానికి ముందు.. మార్గమధ్యంలోని ప్రఖ్యాత హనుమాన్ గధీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారని, ఆ సమయంలోనే ప్రధాని ఆరోగ్యం, దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని వేద మంత్రాలు చదువుతామని హనుమాన్ గధీ ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ మీడియాకు తెలిపారు. మోదీ రాకకు సంబంధించి పీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయని దాస్ చెప్పారు.
షాకింగ్: కరోనాతో బలవంతపు కాపురమే - దశాబ్దాలపాటు వైరస్ ప్రభావం - WHO సంచలన ప్రకటన..
ప్రధాని కోసం నేతన్న ప్రత్యేక వస్త్రం..
అయోధ్య భూమి పూజలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం.. ఆయన నియోజకవర్గమైన వారణాసికి చెందిన బచ్చే లాల్ అనే చేనేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించారు. ‘‘జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్'' అనే అక్షరాలను, శ్రీరాముడి ధనస్సును ఆ వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేశారు. నాణ్యత, డిజైన్ పరంగా అదెంతో గొప్ప వస్త్రమని, సిల్క్, కాటన్, బంగారు తీగలు, రంగులతో రూపొందిన ప్రత్యేక వస్త్రం తయారీకి 15 రోజుల సమయం పట్టిందని లాల్ తెలిపారు. 72 అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పున్న ఈ వస్త్రాన్ని వారణాసి పోలీస్ కమిషనర్ ద్వారా అయోధ్యకు పంపాలనుకుంటున్నట్లు ఆయన వివరించారు.
Recommended Video
దేశవిదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం..
అయోధ్యలో రామ మందిరం భూమి పూజ ఘట్టం.. ఇండియాతోపాటు దేశదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మేరకు సర్వత్రా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆగస్టు 5న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్లో ఆంగ్లం, హిందీ భాషల్లో జై శ్రీరాం పేరుతో భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వివిధ సంస్థల ద్వారా ఇతర దేశాల్లోనూ లైవ్ ప్రసారాలు చేయబోతున్నారు. భూమి పూజ రోజున ఉగ్రదాడి జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అయోధ్య నగరమంతంటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.