అయోధ్య కేసు: తుది తీర్పు ముందు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక భేటీ
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అయోధ్య కేసులో కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం సమావేశమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో ఈ సమావేశం జరుగుతోందని, అయోధ్య కేసుపై కీలక చర్చ జరుగుతోందని వన్ఇండియాకు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
అయోధ్య కేసు కీలక తీర్పు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంపైనా చర్చ జరుగుతోంది. సీజేఐ నేతృత్వంలోని ఈ కమిటీలో న్యాయమూర్తులు ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్ ఉన్నారు. అయోధ్య కేసులో తీర్పు ఇచ్చే ముందు ఈ ధర్మాసనం అనేక అంశాలపై తీవ్ర చర్చ జరుపుతోంది.
అలాగే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, మధ్యవర్తిత్వ బృందం ఇచ్చిన వివరాలను కూడా ఈ ధర్మాసనం పరిగణలోకి తీసుకోనుంది. అయితే, మధ్యవర్తిత్వ బృందం ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు బహిర్గం చేస్తుందా లేదా అనేది తెలియదు. అలాగే సున్నీ వక్ఫ్ బోర్డ్ చేసిన వాదనలను కూడా పరిగణలోకి తీసుకోనుంది.
ఇంతకుముందు పరిణామాలు..
కాగా, సుప్రీంకోర్టు అయోధ్య కేసులో తుది తీర్పును రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా- అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేనెల 4 నుంచి 15వ తేదీ లోపు ఎప్పుడైనా వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదే నెల 17వ తేదీన గొగొయ్ పదవీ విరమణ చేయనున్నందు.. ఆ లోపే తీర్పును వెలవడించాలని చీఫ్ జస్టిస్ ఓ నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తోంది. హైడ్రామాల మధ్య అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టే బుధవారం తుది విచారణు నిర్వహించారు. విచారణ సందర్భంగా న్యాయవాదుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోవడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏ స్థాయిలో తీవ్ర రూపాన్ని ధరించిందనే విషయం స్పష్టమౌతోందని నిపుణులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసుపై తుది విచారణ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. వచ్చే నెల 17వ తేదీ లోపలే అయోధ్య భూ వివాదం కేసుపై తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున ఆయన తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయోధ్యపై 40 రోజుల పాటు చేపట్టిన విచారణ సందర్భంగా ఎదురైన అభిప్రాయాలపై చర్చించాల్సి ఉందని, విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తే.. సమయం సరిపోదని గొగొయ్ భావించినట్లు చెబుతున్నారు.
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల స్థలాన్ని ఎవరికి చెందాలనే విషయంపై దాఖలైన పిటీషన్లపై చేపట్టిన విచారణ పర్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారానికి తెర దించిన విషయం తెలిసిందే. రంజన్ గొగొయ్ సహా ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, నజీర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. నవంబర్ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఆయన తీర్పును వెల్లడించాల్సి ఉంది.