అత్యవసరమేం కాదు: అయోధ్య కేసు విచారణను జనవరికి వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ: అయోధ్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వచ్చే ఏడాది జనవరి తర్వాత అయోధ్య కేసు విచారిస్తామని పేర్కొంది. విచారణ తేదీలను, ధర్మాసనం వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. విచారణను జనవరికి వాయిదా వేసింది.
2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు మూడు రకాలైన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లను సోమవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ.. వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. నాలుగు నిమిషాల్లోనే విచారణ ముగించారు.