అయోధ్య కేసు: ముస్లిం పార్టీల తరపున వాదించిన రాజీవ్ ధవన్ తొలగింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేయబోయే ముందు అయోధ్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయోధ్య భూవివాదం కేసులో ఆ భూమి రామ్లల్లాకే చెందుతుందని అదే సమయంలో మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ఐదెకరాల భూమిని కేటాయించాలంటూ తీర్పు చెప్పింది. ఇక ఈ కేసుకు సంబంధించి ముస్లిం పార్టీల తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ముస్లిం పార్టీలు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి కూడా తెలిసిందే.
ఇక రివ్యూ పిటిషన్ సందర్భంగా వాదనలు వినిపించేందుకు మాత్రం రాజీవ్ ధవన్ను లాయర్గా నియమించుకోలేదు. ఇదే విషయాన్ని లాయర్ రాజీవ్ ధవన్ తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. బాబ్రీ కేసు రివ్యూ పిటిషన్ నుంచి తొలగించబడ్డానంటూ రాజీవ్ ధవన్ పోస్టు చేశారు. జమియత్ తరపున వాదనలు వినిపిస్తున్న ఇజాజ్ మక్బూల్ ఈ మేరకు తనను తొలగిస్తూ రాసిన లేఖను పంపారని రాజీవ్ ధవన్ తెలిపారు. ఇక అయోధ్య కేసులో కానీ రివ్యూ పిటిషన్లో కాని తనకు ఎలాంటి సంబంధము లేదని రాజీవ్ ధవన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తాను అనారోగ్యంతో ఉన్నందునే తనను రివ్యూ పిటిషన్ నుంచి లాయర్గా తొలగించారని తనతో చెప్పినట్లు రాజీవ్ ధవన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే సోమవారం రోజున అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదంలో ముస్లిం పార్టీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను మౌలానా సయ్యద్ అషద్ రషీది దాఖలు చేశారు. ఈయన బాబ్రీ మసీదు కేసులో ఒరిజినల్గా పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ దారుడి వారసుడు. బాబ్రీ మసీదు నిర్మాణం అక్కడే జరిగేలా సుప్రీంకోర్టు కేంద్రానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని తెలిపాడు. నవంబర్లో అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదంపై తీర్పు ఇచ్చిన తర్వాత తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలైన తొలిపిటిషన్ ఇదే కావడం విశేషం.
ఓ వైపు బాబ్రీ మసీదును కూల్చడం నేరమని చెబుతూనే మరోవైపు వివాదాస్పద భూమిని హిందూ పార్టీలకు కేటాయించడం సరికాదని రివ్యూ పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నాడు. ఇక కేసు సున్నితత్వాన్ని తాను అర్థం చేసుకోగలనని చెబుతూనే న్యాయం జరగకుండా శాంతి నెలకొనదని రివ్యూ పిటిషన్లో పేర్కొన్నాడు. మొత్తం 217 పేజీలతో కూడిన రివ్యూ పిటిషన్ను దాఖలు చేసిన రశీదీ... సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 14 తప్పిదాలను ప్రస్తావించారు.