హిందువుల విశ్వాసంపై అయోధ్య కేసులో తీర్పు ఇవ్వరాదు: ముస్లిం సంఘాలు
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసులో కీలక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమిని హిందువులు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అయితే... కేవలం హిందువుల మత విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని అయోధ్యపై నిర్ణయం చేయరాదని కేసులో పిటిషన్ దాఖలు చేసిన కొన్ని ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును కోరాయి. అంతేకాదు రాముడు అయోధ్యలో జన్మించారని హిందూ సంఘాలు చెబుతున్నాయని అయితే 1934 నుంచి అక్కడ ఓ మసీదు ఉన్నదన్న సంగతి కూడా మరువరాదని ముస్లిం సంఘాలు న్యాయస్థానం ముందు తెలిపాయి.
అయోధ్య కేసులో ఇచ్చే తీర్పు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భారత దేశ భవిష్యత్తు పై ప్రభావం చూపుతుందని ముస్లిం పార్టీల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ చెప్పారు. అంతేకాదు లౌకికవాదం, రాజ్యాంగంపై కూడా ఈ తీర్పు ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడు అని కోర్టు ఎలా చెప్పగలుగుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, మరియు అబ్దుల్ నజీర్ల ధర్మాసనం ముందు ముస్లి పార్టీల తరపున వాదనలు వినిపించారు రాజీవ్ ధవన్. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ లేవనెత్తిన అంశంపై రాజీవ్ న్యాయమూర్తి వాదనలు వినిపిస్తూ.. కోర్టు సమతుల్యంతో వ్యవహరించాల్సి ఉందని కోరారు.
కేసులో సమతుల్య చర్యలు పాటిస్తే లౌకిక నిర్మాణంకు దెబ్బ
కేసులో సమతుల్యత పాటిస్తే దేశంలోని లౌకిక నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలుతుందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. బాబ్రీ మసీదులో ఇది హిందువులకు చెందినది అని చెప్పే రుజువు ఒక్కటి కూడా లేదని కోర్టుకు తెలిపారు రాజీవ్ ధవన్. అంతేకాదు ఒక నెమలి బొమ్మనో లేక కమలం పువ్వు బొమ్మనో శ్లాబ్ మీద దొరికితే అంది హిందువుల నిర్మాణం అని ఎలా నిర్ధారిస్తారు అని ప్రశ్నించారు. 1934లో హిందువులు మసీదును ధ్వంసం చేశారని గుర్తు చేసిన రాజీవ్ ధవన్, 1949లో అక్రమంగా మసీదులోకి చొరబడి విగ్రహాలను ఏర్పాటు చేశారని చెప్పారు. 1992లో బాబ్రీ మసీదునే కూల్చేశారని రాజీవ్ ధవన్ చెప్పారు. ఇవన్నీ కళ్ల ముందు జరిగిన అంశాలని వీటిని విస్మరించి మత విశ్వాసం, నమ్మకం అంశాలను పరిగణలోకి ఎలా తీసుకుంటామని ధవన్ ప్రశ్నించారు. హిందువులు తమ హక్కులను పరిరక్షించాలని కోరుతున్నారని అయితే రాజ్యాంగం ఒక్క హిందువుల కోసమే ఉన్నది కాదని... కళ్లముందు జరిగిన సాక్ష్యాలు వారు వాదనలు తప్పని నిరూపిస్తున్నాయని రాజీవ్ ధవన్ చెప్పారు.
కళ్లముందు జరిగిన సాక్ష్యాలను ఎలా విస్మరిస్తాం: న్యాయవాది
అయితే వాదనల సందర్భంగా మనది లౌకికపరమైన రాజ్యాంగమని కేవలం హిందువుల రాజ్యాంగం కాదని ఈ అంశంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని బెంచ్ వారించింది. అయితే కొన్ని హిందూ సంఘాలు వాదిస్తున్నదాని బట్టే తను ఇదంతా కోర్టు ముందు ప్రస్తావించాల్సి వచ్చిందని రాజీవ్ ధవన్ చెప్పారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తన వాదనలు వినిపిస్తున్నట్లు చెప్పారు. ఇక మసీదును ఖాళీగా ఉన్న స్థలంలోనే నిర్మించారని చెప్పారు. అంతేకాదు కూల్చిన మసీదు కింద హిందూ ఆలయం ఉండేదని చెబుతున్న ఏఎస్ఐ నివేదికను రాజీవ్ ధవన్ తప్పుబట్టారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 90 చోట్ల తవ్వకాలు జరపగా కొన్ని శతాబ్దాల క్రితం ఉన్న హిందూ నమూనాలు బయటపడ్డాయని, అయితే ఇవి ఎప్పుడో పూర్వం అక్కడ ఉండి ఉంటాయని, అవి కాలగర్భంలో శిథిలావస్తకు చేరుకున్నాయని చెప్పారు. ఇక మసీదు నిర్మాణం చేపట్టే నాటికి అది ఖాళీ స్థలం అని రాజీవ్ ధవన్ న్యాయస్థానంకు తెలిపారు. భారత పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడి హిందూ ఆలయాలు ఉన్నాయని నిర్ధారించలేమని చెప్పారు.