అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్: మధ్యవర్తిత్వానికి హిందూ సంఘాలు నో, ముస్లీం సంఘాలు ఓకే
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అనే దానిపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ కేసుపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది.
అమిత్ షా వ్యాఖ్యలపై మోడీ మౌనం వెనుక రహస్యమేమిటి: ఎయిర్ స్ట్రైక్స్పై మాయావతి
మధ్యవర్తి నియామకంపై ఇరువర్గాల వాదలు విన్నది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఇది కేవలం భూవివాదం మాత్రమే కాదని, మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశమని గతాన్ని మనం మార్చలేమని జస్టిస్ బాబ్డే అన్నారు. గతంలో ఏం జరిగిందనేది అప్రస్తుతమని, దేవాలయాన్ని కూల్చారా, మసీదును కూల్చారా అనేది అప్రస్తుతమని, ప్రస్తుత వివాదాన్ని మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఆ వివాదాన్ని పరిష్కరించాలని చూస్తామన్నారు. సమస్య పరిష్కారానికి ఒకరి కంటె ఎక్కువమంది మధ్యవర్తు అవసరమని భావిస్తున్నామన్నారు.
మధ్యవర్తిని ఏర్పాటు చేయడాన్ని హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మధ్యవర్తిత్వంపై ఇస్లాం సంఘాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు వైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేశారు.
కాగా, అయోధ్య కేసు వివాదం పరిష్కారానికి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సెక్షన్ 89 కింద మధ్యవర్తిత్వ ప్రక్రియకు అనుమతించాలా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టు ఈ రోజు నిర్ణయానికి వస్తుందని అందరూ భావించారు. ఈ వివాద పరిష్కారానికి పలువురు మధ్యవర్తులతో కూడిన ప్యానల్ అవసరమని జస్టిస్ బాబ్డే తెలిపారు. కానీ హిందూ సంఘాలు వ్యతిరేకించారు. అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పును రిజర్వ్లో ఉంచింది.