అయోధ్య భూ వివాదానికి త్వరలో తెర: అదే తుది రోజు: తనకు తానే డెడ్ లైన్ విధించుకున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దశాబ్దాల తరబడి న్యాయ స్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఇక దాదాపు తుది అంకానికి చేరుకున్నట్టే. సుప్రీంకోర్టు దీనిపై డెడ్ లైన్ విధించింది. సుప్రీంకోర్టు తనకు తానే డెడ్ లైన్ విధించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చేనెల 17వ తేదీన చోటు చేసుకునే వాదోపవాదాలే.. తుది విచారణ అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ వెల్లడించారు. అక్టోబర్ 17వ తేదీ తరువాత ఇక రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై ఇక తదుపరి విచారణలు ఉండకపోవచ్చని ఆయన చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో చారిత్రాత్మక బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలంలోనే శ్రీరామచంద్రుడి ఆలయాన్ని నిర్మించాలంటూ హైందవ సంఘాలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్థలం తమకు దక్కుతుందటే.. తమకు దక్కుతుందంటూ రామ జన్మభూమి న్యాస్, బాబ్రీ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో కేసు వేశాయి. సంవత్సరాల నుంచీ ఈ కేసు న్యాయస్థానాలో నానుతూ వస్తోంది. ఇదివరకు అలహాబాద్ హైకోర్టు బెంచ్, ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు రెండు కమిటీల ప్రతినిధులు.
ప్రస్తుతం రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసు విచారణ సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇప్పటిదాకా 37 సార్లు సుప్రీంకోర్టు ఈ కేసుపై వాదోపవాదాలను ఆలకించింది. అయినప్పటికీ.. ఇది ఓ కొలిక్కి రాలేదు. శుక్రవారం కూడా ఈ కేసు సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పాటైన అయిదు మంది సభ్యులు ధర్మాసనం విచారించింది. రంజన్ గొగొయ్ సహా న్యాయమూర్తులు ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీనిపై వాదోపవాదాలను విన్న తరువాత..రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే నెల 17వ తేదీన తుది తీర్పును వినిపిస్తామని అన్నారు. 14వ తేదీ వరకు ముస్లిం కమిటీలు, ఆ తరువాత రెండురోజులు హిందూ సంఘాలకు తమ వాదనలను వినిపించే అవకాశం ఇస్తామని వెల్లడించారు. ఈ రెండు సంఘాల ప్రతినిధుల నుంచి అందిన విజ్ఞప్తులను బేరీజు వేసుకుని.. 17వ తేదీన తుది విచారణను నిర్వహిస్తామని రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు.ఆ తరువాతఈ కేసుపై వాదోపవాదాలు ఉండకపోవచ్చని, ఇక తుది తీర్పే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.