అక్టోబర్ 17తో ముగియనున్న అయోధ్య కేసు: సుప్రీం
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూమికి సంబంధించిన విచారణను అక్టోబర్ 17తో ముగించనున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ వివాదంపై 37వ రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ముస్లిం పక్షాల వాదనలు అక్టోబర్ 14తో ముగుస్తాయని, ఆ తర్వాత రెండు రోజులపాటు హిందూ పక్షాల రిజాయిండర్కు అనుమతిస్తామని చెప్పింది. ఇక అక్టోబర్ 17తో విచారణను ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయోధ్య భూ వివాదంలో మధ్యవర్తిత్వం విఫలం కావడంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తోపాటు జస్టిస్ ఎన్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎన్ఏ నజీర్ ఉన్నారు.
ఇటీవల అక్టోబర్ 18తో వాదనలు ముగిస్తామని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా ఆ గడువును ఒక రోజు ముందుకు తెచ్చింది. ఇది ఇలా ఉండగా, శుక్రవారం విచారణ సందర్భంగా ముస్లిం పార్టీలు సంచలన ఆరోపణలు చేశాయి. మధ్యవర్తిత్వం చర్చల వివరాలు బయటికి పొక్కాయని, గోప్యత పాటించలేదని సుప్రీంకోర్టుకు తెలిపాయి.
సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ముస్లింపార్టీల తరపున వాదనలను వినిపించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో చర్చించిన కొన్ని విషయాలు గోప్యంగా ఉంచలేదన్నారు. సాక్ష్యాధారాలు, అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా బయటికి వచ్చాయన్నారు. ఈ కేసులో తీర్పు ప్రభావం భవిష్యత్తులో ఉంటుందని చెప్పారు.