Ayodhya Case:కేసులో రామ్లల్లా పిటిషనర్గా ఎలా అయ్యారు..?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంలో వాదనలు చివరి దశకు చేరుకున్నాయి. ఇక నవంబర్ 17లోగా అంటే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా దీనిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక కేసులో రామ్లల్లా తరుపున సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఆలయంలో దేవుడిగా పూజింపబడుతున్న శ్రీరాముడి విగ్రహం ఈ కేసులో ఉండటం ఆసక్తికరంగా మారింది. రామ్లల్లా కేసుతో ముడిపడి ఉండటమేంటంటూ గతంలో అలహాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా ప్రశ్న తలెత్తింది.
అయితే వివాదాస్పదంగా మారిన భూమిపై రాముడి విగ్రహంకు ఉన్న హక్కులను గురించి కూడా సుప్రీం కోర్టు గతంలో ప్రస్తావించింది. ఆలయాలు, లేదా అందులో ఉన్న దేవుడి విగ్రహాల తరపున ట్రస్టీలు ఉండొచ్చని చట్టంలో ఉంది. అయితే ఆలయాలు వాటి ఆస్తులను చాలా సందర్భాల్లో ట్రస్టీలే నిర్వహిస్తూ ఉంటారు. అంటే అయోధ్య కేసులో కూడా డీడ్ విగ్రహంపైనే ఉంటుందనేది స్పష్టమవుతోంది. అందుకే కేసులో పిటిషనర్గా విగ్రహం కూడా ఉంది. ఇక అయోధ్య కేసులో రామ్లల్లా మైనర్గా చూస్తున్న నేపథ్యంలో గార్డియన్ ఈ కేసులో కోర్టుకు హాజరవుతున్నారు.
ఒక కేసులో పిటిషనర్ అయి ఉండాలంటే కేవలం మనుషులు మాత్రమే ఉండక్కర్లేదని ఒక వస్తువు తరపున చట్టపరంగా మరో వ్యక్తి ఉండొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంటోంది. ఇక క్లుప్తంగా చెప్పాలంటే పిటిషనర్ మనిషే అయి ఉండాల్సిన పనిలేదని వస్తువైనా, లేదా ప్రాణంలేనిదైనా ఉండి దాని తరపున ఉన్న వారిని ఎవరినైనా కోర్టు గుర్తిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. చట్టపరంగా అన్నిటికీ అర్హుడైతే ఒక వ్యక్తికి ఆస్తులను పొందే హక్కు ఉంటుంది. కానుకలు పొందొచ్చు. అదే సమయంలో ఏదైనా లిటిగేషన్లు ఉత్పన్నమైతే వస్తువులపై వ్యక్తి కేసు వేయొచ్చు.
హిందూ చట్టం ప్రకారం విగ్రహాలు కూడా చట్టపరిధిలోకి వస్తాయని ఉంది. ఇందులో భాగంగానే శ్రీరాముడి విగ్రహం కూడా అయోధ్య కేసులో చట్టపరమైన వ్యక్తికిందనే ట్రీట్ చేయడం జరుగుతోంది. హిందూ విగ్రహాలు చట్టపరిధిలోనే ఉంటాయని కోర్టులు గుర్తిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహం బాగోగులు ఎవరైతే చూస్తున్నారో అట్టివారిని గార్డియన్ లేదా మేనేజర్గా కోర్టులు పరిగణిస్తున్నాయి. ఇక అయోధ్యకేసులోని భూమి శ్రీరాముడికి చెందినది అనేది ఒక వాదన ఉంటుండగా ఒకవేళ నిజంగానే తీర్పు రామ్లల్లాకు అనుకూలంగా వస్తే దీనికి సంబంధించిన భూమిపై అన్ని హక్కులు ట్రస్టుకు ఉంటాయి.