అయోధ్య పుస్తకాన్ని చించేసిన న్యాయవాది: మీరిలాగే వాదిస్తే..లేచి వెళ్లిపోతామంటూ చీఫ్ జస్టిస్ ఫైర్!
న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తోన్న అయోధ్య భూ వివాదంపై బుధవారం నాటితో తుది విచారణను ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. అక్కడి వాతావరణం హీటెక్కింది. అయోధ్య భూ వివాదంతో ముడిపడి ఉన్న అన్ని సంఘాలు, ప్రతినిధులు, న్యాయవాదులు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. విచారణ ఏకధాటిగా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం అన్ని పక్షాల వాదోపవాదనలను ఆలకిస్తోంది.
న్యాయవాదుల మధ్య ఘర్షణ..
విచారణ సందర్భంగా న్యాయవాదుల మధ్య ఘర్షణ పూరక వాతావరణం చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సమక్షంలోనే న్యాయవాదులు ఒకరినొకరు తోసుకున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంత వరకూ వెళ్లింది పరిస్థితి. ఈ సందర్భంగా కాస్సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి కునాల్ కిశోర్ అయోధ్య భూ వివాదంపై రాసిన `అయోధ్య రీ విజిటెడ్` పుస్తకాన్ని చింపి వేయడానికి ప్రయత్నించిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయోధ్య భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావనకు వచ్చాయి.
పేజీలను చింపేసిన వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది..
అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను న్యాయవాది వికాస్ సింగ్ చదవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో- సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున కేసును వాదిస్తోన్న న్యాయవాది రాజీవ్ ధవన్ దాన్ని లాగేశారు. తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పుస్తకాన్ని చింపేయడానికి ప్రయత్నించారు. కొన్ని పేజీలను చింపేశారు కూడా. ఈ సందర్భంగా తోటి న్యాయవాదులు రాజీవ్ ధవన్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సమక్షంలోనే ఈ హైడ్రామా నడిచింది. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మీరిలాగే వాదిస్తే.. లేచి వెళ్లిపోతాం:
న్యాయవాదుల ప్రవర్తన పట్ల రంజన్ గొగొయ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. వారిపై నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాదిని తీవ్ర స్వరంతో మందలించారు. `మీ వాదన ఇలాగే కొనసాగితే మేమేమీ చేయలేం. వాదనలను ఇక్కడితో ఆపేసి లేచి వెళ్లిపోతాం..` అని హెచ్చరించారు. న్యాయస్థానం అంటే లెక్క లేదా? కీలక విచారణలో ధర్మాసనం ముందే ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహించారు. దీనితో హిందూ మహాసభ తరఫు న్యాయవాది మెత్తబడ్డారు. క్షమించమని కోరారు. న్యాయస్థానం పట్ల తనకు అపార విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవ మర్యాదలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు.