Ayodhya case:ముస్లింలను మాత్రమే ప్రశ్నించారు హిందువుల సంగతేంటి..?
న్యూఢిల్లీ: అయోధ్య విచారణలో వాదనలు చివరి అంకానికి చేరుకున్నాయి. అక్టోబర్ 18కల్లా అయోధ్య బాబ్రీ మసీదు కేసులో వాదనలు పూర్తికావాలంటూ అత్యున్నత న్యాయస్థానం డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం రోజున సుప్రీంకోర్టు వాదనలు వినింది. అయితే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేవలం ముస్లిం పార్టీలకు మాత్రమే ప్రశ్నలు వేసిందని హిందూ పార్టీలను ప్రశ్నించలేదని ముస్లిం వర్గాలు ఆరోపణలు చేశాయి.
న్యాయస్థానం ముస్లిం పార్టీలను మాత్రమే ప్రశ్నించింది
"న్యాయస్థానం విచారణ సందర్భంగా అయోధ్య బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్లుగా ఉన్న ముస్లిం పార్టీలను మాత్రమే ప్రశ్నించి హిందూ పార్టీలను ప్రశ్నించలేదు. అయినప్పటికీ వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాము. " అని ముస్లిం పార్టీల తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ తెలిపారు. అయితే రాజీవ్ ధవన్ చెప్పిన మాటలతో అంగీకరించలేదు హిందూ పార్టీల తరపున లాయర్ సీఎస్ వైద్యనాథన్. ఇది పూర్తిగా సత్యదూరం అని న్యాయస్థానం 38వ సారి వాదనలు వింటోందని గుర్తుచేశారు.
పూజలు చేసుకోవచ్చు, కానీ భూమిపై హక్కు లేదు
అయోధ్య భూవివాదం కేసులో ఓ ఐరన్ రెయిలింగ్ నిర్మాణం వెనక వేరే దురుద్దేశం లేదని లోపలి ప్రాంగణం నుంచి బయట ప్రాంగణంను వేరు చేసేందుకు మాత్రమే నిర్మించినట్లు కోర్టు తెలిపింది. బయట ఉన్న ప్రాంగణంలో హిందువులు రామ్ చబుత్ర, సీతా రసోయ్, బందర్ గృహ్లకు పూజలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు హిందువులు వివాదాస్పదంగా ఉన్న స్థలంలోకి పూజలు మాత్రమే నిర్వహించుకోవచ్చని అలా అని వారికి ఆ భూమిపై ఎలాంటి హక్కులు లేవని రాజీవ్ ధవన్ కోర్టుకు వివరించారు.
పూజలు చేసుకోవచ్చు కానీ భూమి వారికి ఎందుకు చెందదు?
వివాదాస్పదమైన భూమిలో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని చెబుతున్నప్పుడు భూమి వారికి ఎందుకు చెందదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవేళ నిజంగానే మూడో పార్టీ ఆ భూమి హక్కుదారుడై ఉండి ఉంటే ఇతరులను లోపలికి అనుమతించి పూజలు నిర్వహించేందుకు ఓకే చెప్పేవారా అని రాజీవ్ ధవన్ను కోర్టు ప్రశ్నించింది. ఇదిలా ఉంటే అయోధ్యలో డిసెంబర్ 10వరకు సెక్షన్ 144 విధించడం జరిగింది. మరికొద్దిరోజుల్లో అయోధ్యపై తీర్పు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ సెక్షన్ 144 విధించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నంతవరకు అక్కడ బోటింగ్, టపాసుల అమ్మకాలపై నిషేధం విధించారు.
మొత్తానికి అయోధ్య భూవివాదం కేసులో వాదనలు అక్టోబర్ 17న ముగియనుండగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందే లోగా అంటే నవంబర్ 17లోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది.