సరయూ తీరంలో సరికొత్త అధ్యాయం..చరిత్ర సృష్టించిన అయోధ్య.. !
లక్నో: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్య..చరిత్ర సృష్టించింది. అలాంటిలాంటి చరిత్ర కాదది. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేసింది. అయోధ్య గుండా ప్రవహించే సరయూ నదీ తీరంలో చోటు చేసుకున్న ఘటనను గిన్నిస్ బుక్ ప్రతినిధులు గుర్తించారు. సరయూ నదీ తీరంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన దీపోత్సవ్ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ లో చోటిచ్చారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ శనివారం రాత్రి చేపట్టిన దీపోత్సవ్-2019 కార్యక్రమంలో అయిదున్నర లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఒకేచోట ఇన్ని లక్షల సంఖ్యలో దీపాలను వెలిగించడం ఇదే తొలిసారి.
5.51 లక్షల మట్టి ప్రమిదల్లో..
ఏటేటా దీపావళి పండుగ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఆరంభంలో 51,000 దీపాలతో ఆరంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 5,51,000లకు చేరింది. ఈ ఏడాది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం దీన్ని నిర్వహించింది. సాయంత్రం 7 గంటల సమయంలో సరయూ తీరానికి చేరుకున్న వందలాది మంది భక్తులు.. దశలవారీగా దీపాలను వెలగించారు. చివరి వరకూ వాటిని ఆరిపోనివ్వలేదు. సరయూ తీరంలో నిర్మించిన ఘాట్లలో.. ఒక్కో ఘాట్ వద్ద 50 వేలకు పైగా దీపాలను ప్రజ్వలింపజేశారు.
దీప కాంతుల్లో మెరిసిన సరయూ
లక్షల కొద్ది దీప కాంతుల్లో సరయూ తీరం సుమారు మూడు గంటల పాటు మెరిసిపోయింది. మరో లోకానికి తీసుకెళ్లింది. శ్రీరామచంద్రుడి కీర్తనలు, హనుమాన్ చాలీసా పఠనంతో అయోధ్య, సరయూ నది తీర ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక భావనలను వెదజల్లింది. దీపోత్సవ్ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. జై శ్రీరామ్ అంటూ నినదించారు. హనుమాన్ చాలీస సామూహిక పఠన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర మంత్రులు దీనికి హాజరయ్యారు.
ఫిజీ మంత్రి నోట.. హిందీ భక్తి గీతం
ఫిజీ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి వీణా కుమార్ భట్నాగర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత సంతతికి చెందిన ఆమె హిందీ భక్తి గీతాలను ఆలపించారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను సందర్శించాలనే తన చిరకాల కోరిక తీరినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్యఅతిథిగా పిలవాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం తన అదృష్టమని, ఏటా ఈ దీపోత్సవ్ కార్యక్రమానికి హాజరు కావాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీపోత్సవ్ ను నిర్వహించడానికి ప్రభుత్వం 133 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం విశేషం.